Billgates on Covid | కొవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగి పోలేదని బిలియనీర్ బిల్గేట్స్ హెచ్చరించారు. మరింత ప్రాణాంతకమైన, శరవేగంగా వ్యాపించే సామర్థ్యం గల కొవిడ్ వేరియంట్ దూసుకొస్తున్నదని పేర్కొన్నారు. దాని కట్టడికి అంతర్జాతీయంగా ఆంక్షలు పెంచాల్సిన అవసరం ఉందని మంగళవారం నొక్కి చెప్పారు. ఆ కొవిడ్ వేరియంట్ ఐదు శాతానికంటే ఎక్కువ ముప్పని పేర్కొన్నారు. పరిస్థితులు దుర్భరంగా ఉంటాయని చెప్పడం లేదన్నారు. కొవిడ్ మహమ్మారి వల్ల పుట్టుకొస్తున్న వేరియంట్ మరింత ప్రమాదకరమైందని, వేగంగా వ్యాపించగల సామర్థ్యం కలిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. వైరస్ల వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు గురించి బిల్గేట్స్ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు.
2015లో తొలిసారి బహిరంగంగా ప్రపంచ దేశాలను బిల్గేట్స్ హెచ్చరించారు. యావత్ ప్రపంచం తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షల అమలును నిలిపివేశారన్నారు. తదుపరి మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలన్న విషయమై బిల్గేట్స్ పుస్తకం రాశారు. ప్రపంచ ఆరోగ్య ముప్పును త్వరితగతిన గుర్తించడంతోపాటు ప్రపంచ దేశాల మధ్య సమన్వయానికి అంటు వ్యాధుల నిపుణులు, కంప్యూటర్ నిపుణులతో ఒక టీంను సృష్టించాలని సూచించారు. దీనికి 100 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఈ నిధులను అందుబాటులోకి తేగలదని చెప్పారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలు ఆరోగ్య సంక్షోభంపై హస్వదృష్టి ప్రదర్శించొద్దని బిల్గేట్స్ హితవు చెప్పారు. భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి భారీ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కొవిడ్ మహమ్మారి నుంచి ఇంకా ముప్పు పొంచి ఉందని, ఇన్ఫెక్షన్ సోకకుండా దీర్ఘకాలం రోగ నిరోధక శక్తి గల వ్యాక్సిన్లను అత్యవసరంగా తేవాల్సి ఉందని వాదించారు.