పాట్నా: సాధారణంగా వ్యక్తులు తమ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. అయితే ఒక వ్యక్తి మాత్రం తన గుర్రం పుట్టిన రోజు వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో జరిపారు. 22.5 కేజీల కేక్ కట్ చేయడంతోపాటు బంధు, మిత్రులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించి భారీగా విందు భోజనం ఏర్పాటు చేశారు. గుర్రం బర్త్ డే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది.
బీహార్లోని సహర్సా జిల్లా పంచవతి చౌక్ నివాసి అయిన రజనీష్ కుమార్ అలియాస్ గోలు యాదవ్కు చేతక్ అనే గుర్రం ఉన్నది. దానిని ఆయన తన సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఆ గుర్రం రెండవ పుట్టిన రోజును గ్రాండ్గా జరిపారు. చేతక్ బర్త్ డే పార్టీకి బంధు, మిత్రులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించారు. 22.5 కేజీల కేక్కు ఆర్డర్ ఇవ్వడంతోపాటు భారీగా విందు ఏర్పాటు చేశారు.
గుర్రం చేతక్ పుట్టిన రోజు నాడు రజనీష్ కుమార్ దానికి ప్రత్యేకంగా స్నానం చేయించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆ గుర్రం బొమ్మ ఉన్న భారీ కేక్ను బంధు, మిత్రుల మధ్య కట్ చేయడంతోపాటు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. ఆ తర్వాత స్థానికులు, బంధు మిత్రులకు వెజ్, నాన్ వెజ్ వంటి పలు రకాల వంటకాలతో భోజనాలు పెట్టారు.
ఈ సందర్భంగా చేతక్తో తన అనుబంధాన్ని రజనీష్ పంచుకున్నారు. ఆరు నెలల వయసులో దానిని తన ఇంటికి తెచ్చానని, తొలుత పాలు పట్టి పెంచానని తెలిపారు. తన పిల్లల మాదిరిగానే దానిని కుటుంబంలో ఒకరిగా చూసుకున్నానని, తన పిల్లల కంటే ఎక్కువగా దాని పట్ల ప్రేమను చూపించానని చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ కూడా పుట్టిన రోజు జరుపుకోకపోయినా చేతక్ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నానని తెలిపారు. తొలి బర్త్ డే కూడా అంతే ఆడంబరంగా జరిపినట్లు వెల్లడించారు. చేతక్ను ఎవరైనా జంతువుగా చూస్తే సహించబోనని అన్నారు.
మరోవైపు ఈ సందర్భంగా రజనీష్ కుమార్ ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. ప్రజలంతా జంతువులను ప్రేమించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొందరు జంతువులపై హింసకు పాల్పడుతున్న సంఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో మనుషులకన్నా జంతువులు ఎంతో నమ్మకమైనవని అన్నారు. అందుకే వాటిని జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యుల మాదిరిగా చూడాలని, ప్రేమను పంచాలని సూచించారు.