మాక్లూర్, నవంబర్ 10: ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తండ్రి కృష్ణమూర్తి ప్రథమ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో బుధవారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, జాజాల సురేందర్, హన్మంత్షిండే, నగర మేయర్ నీతూకిరణ్ తదితరులు హాజరై కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వ్యవసాయ క్షేత్రంలో స్మృతి వనం ఏర్పాటుకు స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రైతు బిడ్డ కృష్ణమూర్తి ఏడు పదుల వయస్సులోనూ వ్యవసాయ పనులు చూసుకునేవారని గుర్తుచేశారు. కృష్ణమూర్తి ఆశయాలను మరిచిపోకుండా ఆయన పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, స్మృతివనం ఏర్పాటు చేయడం ఆయనకు ఘన నివాళి అర్పించడమని మంత్రి వేముల అన్నారు. కృష్ణమూర్తి జ్ఞాపకార్థం మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలను అన్ని హంగులతో కార్పొరేట్ను తలదన్నే రీతిలో రూ. 4.50 కోట్లతో నిర్మిస్తామని ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు.