వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇంటిని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సందర్శించారు. అమెరికా 39వ అధ్యక్షుడైన కార్టర్ తోనూ, ఆయన సతీమణి రోజలిన్ కార్టర్ తోనూ విడిగా సమావేశమయ్యారు. జార్జియాలోని ప్లెయిన్స్ పట్టణంలో ఈ సమావేశం చోటుచేసుకున్నది. ఇందులో వింతేముంది అంటారా.. ఉంది. ఈ సందర్భంగా తీసినట్టుగా చెప్తున్న ఫొటో ఒకటి నెట్ లో వైరల్ అయింది.
బైడెన్, ఆయన సతీమణి జిల్ భారీ పరిమాణంలో, కార్టర్ దంపతులు లిల్లీపుట్స్ లాగా కురచగా కనిపించడం అందుకు కారణం. దీని మీదనే చాలామంది విస్మయం వ్యక్తం చేశారు. బైడెన్ దంపతులు అసాధారణ పరిమాణంలో ఎదిగిన భీకరాకారులా? లేక కార్టర్ దంపతులు వృద్ధాప్యం వల్లనో మనరే ఇతర కారణం వల్లనో కుంచించుకుపోయారా? అని నెటిజనులు ట్విట్టర్లో ప్రశ్నలు సంధిస్తున్నారు.
గత సోమవారం కార్టర్ సెంటర్ విడుదల చేసిన ఫొటో చూసి చాలామంది అవాక్కయ్యారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఫొటోలో కార్టర్ దంపతులు చిన్నగా, బైడెన్ దంపతులు భారీగా కనిపించడంపై వేలమంది కామెంట్లు పెట్టారు. ఈ ఫొటోకు 77 వేల లైకులు వచ్చాయి. భారీకాయులైన బైడెన్ దంపతులు బొమ్మల మ్యూజియంలోకి వెళ్లినట్టుగా నాకు మాత్రమే అనిపిస్తున్నదా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. చివరకు కెమెరాకు వైడ్ యాంగిల్ లెన్స్ ఉపయోగించడం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని తేలింది.