యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యూరప్ ఖండంలోనే ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలోని యెర్రంబెల్లికి చెందిన అన్వితారెడ్డి రికార్డు సృష్టించారు. అలాగే దక్షిణ భారతదేశం నుంచి వింటర్లో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగానూ రికార్డుల్లోకి ఎక్కారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత, అనుకూలించని వాతావరణంలో రాత్రింబవళ్లు సాగిన సాహసయాత్రతో 5,642 మీటర్ల (18,510 అడుగులు) ఎత్తును అధిరోహించి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ నెల 4న మధ్యాహ్నం సమ్మిట్ను మొదలుపెట్టిన అన్విత.. రెండున్నర రోజుల వ్యవధిలోనే శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఎల్బ్రస్ పర్వత శిఖరాగ్రంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే పర్వతారోహకుల కల ‘సెవెన్ సమ్మిట్స్’ను పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.