హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ) : కొత్త సీసాలో పాత సారా సామెత చందంగా ఉన్నది ధరణి, భూభారతి సాఫ్ట్వేర్ పరిస్థితి. ‘అది పనికిరాదు, అక్రమాలకు అడ్డా’ అంటూ ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ఇంకా అదే సాఫ్ట్వేర్ను కొనసాగిస్తున్నది. ధరణిని బంగాళాఖాతంలో పడేశామని, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఘనంగా చెప్పుకొన్నారు. లోపభూయిష్టమైన ధరణి సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ హయాంలో భారీ అవకతవలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ధరణిని ప్రజల్లో ఒక విలన్గా, బూచీగా చూపించారు. కట్ చేస్తే… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది. అయినప్పటికీ, భూభారతికి ప్రత్యేకంగా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించలేదు. ఇప్పటికీ ధరణి సాఫ్ట్వేర్నే భూభారతికి వినియోగిస్తున్నది. ధరణి పేరు, రంగు, మాడ్యూల్స్ మార్చిన సర్కార్.. దీనికి కొత్తగా భూభారతి అనే పేరు పెట్టింది. తప్ప, పెద్దగా చేసిన మార్పులు, సంస్కరణలేమీ లేవు. ఒకవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణికి, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూభారతికి పేర్లు మార్పు తప్ప పెద్ద తేడా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్లో రెండు వెబ్సైట్లూ ఒక్కటే. అయితే, నిర్వహణ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగించిన సర్కార్.. ఇదేదో గొప్ప పని చేసినట్టుగా ప్రకటించుకున్నది.
భూభారతి పేరిట ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, ఇతర వ్యవహారాలన్నీ ధరణి సాఫ్ట్వేర్ ప్రకారమే కొనసాగుతున్నాయి. ధరణిపై అన్ని ఆరోపణలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర నేతలు మళ్లీ అదే సాఫ్ట్వేర్తో భూభారతిని ఎందుకు నడిపిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేండ్లపాటు పాత సాఫ్ట్వేర్ను ఉపయోగించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్పై దృష్టి పెట్టింది. అది కూడా పూర్తిస్థాయిలో సాఫ్ట్వేర్ను మార్చకుండా పాత సాఫ్ట్వేర్లోనే కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కొత్త సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి? ఏయే మార్పులు చేయాలి? ఎలాంటి మాడ్యూల్స్ పెట్టాలనే అంశంపై ప్రభుత్వం ఇటీవల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడానికి కనీసం ఐదు నెలల సమయం పడుతుందని తెలిసింది. అది కూడా అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితేనే.
కొత్త సాఫ్ట్వేర్ వచ్చే వరకు ధరణి సాఫ్ట్వేర్నే ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో నాడు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఒకవేళ నాడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజమే అయితే, మళ్లీ అదే సాఫ్ట్వేర్ను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపయోగిస్తున్నది? అదే సాఫ్ట్వేర్ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు కాబట్టి నాడు బీఆర్ఎస్పై ఆరోపించిన అవకతవకలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్నట్టేనా? ఒకవేళ ఇప్పుడు ఎలాంటి అవకతవకలు జరుగడం లేదంటే అప్పుడు కూడా జరుగనట్టే కదా. రెండున్నరేండ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధరణి సాఫ్ట్వేర్తోనే భూభారతికి కొనసాగిస్తున్నారంటే, ధరణి సాఫ్ట్వేర్ సక్రమేనని కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్టే కదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ఆరోపించినట్టు ధరణి సాఫ్ట్వేర్ అక్రమాల పుట్ట అయితే వారు అధికారంలోకి రాగానే మార్చేవారే కదా? మార్చలేదంటే సాఫ్ట్వేర్పై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేలిపోయినట్టే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాడు ధరణిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినవేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.