హైదరాబాద్ కంచన్బాగ్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో మన శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక ఆయుధాల ప్రదర్శనను తిలకించేందుకు నగర నలుమూలల నుంచి విద్యార్థులు, సాధారణ పౌరులు తరలివస్తున్నారు. ఆజాదీకా అమృతోత్సవ్లో భాగంగా ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 14 నుంచి 19 వరకు ఉ.10గంటల నుంచి సా. 4 గంటల వరకు కొనసాగనుంది. ప్రతి రోజు వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు, జూనియర్ సైంటిస్టులు దాదాపుగా 500 మంది వరకు ఎగ్జిబిషన్ను తిలకిస్తున్నారు.
బీడీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఓంనిధి శర్మ, లక్ష్మీ ప్రసన్న ఎగ్జిబిషన్కు వచ్చిన విద్యార్థులకు ఆయుధాల గురించి వివరిస్తున్నారు. ఇలా ఆకాశ్, వరుణాస్త్ర, అస్త్ర ఎయిర్ టు ఎయిర్, పృథ్వీ, ఎస్ఏఏడబ్ల్యూ, సీఎండీఎస్, దిశాని, ఏటీజీఎం, ఇస్త్రో రాకెట్లు తదితర వాటి గురించి తెలియజేశారు. విద్యార్థులు ఆయుధాల వద్ద గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు.
బీడీఎల్ శాస్త్రవేత్తలు స్వంత పరిజ్ఞానంతో ఆయుధాలను తయారు చేసి దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించిన సేవలో శత్రుదేశాలు ఏ వైపు నుంచి యుద్ధానికి వచ్చినా వారిని తరిమికొట్టే విధంగా ఆయుధాలను తయారు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నేరుగా ఆయుధాలను తిలకించడం వల్ల విద్యార్థుల్లో మేధోశక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకోవాలి.
ఆయుధాల ఎగ్జిబిషన్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటిసారి ఆయుధాలను తిలకించే వీలు కలిగింది.యుద్ధంలో జవాన్లకు ఆయుధాలు ఏ విధంగా ఉపయోగపడుతాయో తెలిసింది. విదేశాల నుంచి ఎన్ని ఆయుధాలు దిగుమతి చేసుకున్నా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాల గొప్పతనం ఎంతో అద్భుతం. ఇలాంటి ప్రదర్శనల వల్ల విద్యార్థులు భవిష్యత్లో దేశం కోసం పని చేయాలనే ఆసక్తి పెరుగుతుంది.
శత్రు దేశాలపై విరుచుకుపడే ఆయుధాలను నేరుగా చూడటం ఇదే మొదటిసారి. మన శాస్త్రవేత్తల గొప్పతనం అద్భుతం. ఒక్కో క్షిపణికి ఒక్కో లక్ష్యం ఉంది. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో శత్రువులు దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ దాడిని తిప్పికొట్టడమే టార్గెట్గా ఆయుధాలను తయారు చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాల వల్ల దేశం గొప్పతనం విశ్వవ్యాప్తంగా నిలుస్తోంది. ఎగ్జిబిషన్కు వచ్చిన ప్రతి విద్యార్థికి ఆయుధాలు వాడే విధానం, తయారు చేసిన తీరుపై అవగాహన పెరుగుతుంది. ఎం. స్వాతి, విద్యార్థిని, గోషామహల్
బీడీఎల్ ఎన్నో ఆయుధాలను అభివృద్ధి చేసింది. అందులో శత్రు దేశాలు నాలుగు వైపులా దాడులు చేసిన వాటిన్ని ఎదుర్కొనే సత్తా ఆకాశ్కు ఉంది. కేవలం 35 సెకన్లలో 25 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించడం విశేషం. శత్రువుల టార్గెట్ను చేధించే విధంగా ఆయుధాలను తయారు చేసి మన గొప్పతనాన్నిశాస్త్రవేత్తలు దేశానికి చాటుతున్నారు. ఏ దేశానికి తీసిపోకుండా మన దేశం కూడా ఆయుధాలను తయారు చేసి ప్రయోగించడంలో ముందుంది. భవిష్యత్లో మరిన్ని కొత్త కొత్త అధునాతన టెక్నాలజీతో ఆయుధాలను తయారు చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. – లక్ష్మీ ప్రసన్న, బీడీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్