Hyderabad CP Sajjanar | హేయ్.. మీ ఫోటో చూశారా? లేదా మీ గురించి ఎవరో ఇలా రాశారు..? అంటూ మీ వాట్సాప్కు ఏదైనా లింక్ వచ్చిందా? అది మీ స్నేహితులు లేదా బంధువుల నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి. మీరు చేసే ఆ ఒక్క క్లిక్ మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్ల పరం చేస్తుందని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ‘ఘోస్ట్ పేయిరింగ్’ (Ghost Pairing) అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను దోచుకుంటున్నట్లు సజ్జనారు తెలిపాడు.
అసలేమిటీ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్?
సాధారణంగా మనం వాట్సాప్ వెబ్ను కనెక్ట్ చేయాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి లేదా OTP ఎంటర్ చేయాలి. కానీ ఈ మోసంలో: హ్యాకర్లు పంపిన లింక్ను మీరు క్లిక్ చేయగానే ఒక నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఆ పేజీని చూడగానే, మీకు తెలియకుండానే మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్కు కనెక్ట్ (Pair) అయిపోతుంది. దీని కోసం వారికి మీ ఫోన్ భౌతికంగా అవసరం లేదు, కనీసం OTP కూడా అడగరు. అందుకే దీన్ని ‘ఘోస్ట్ పేయిరింగ్’ అని పిలుస్తున్నారు.
వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి చిక్కితే ఏం జరుగుతుంది?
మీ చాటింగ్స్, పర్సనల్ ఫోటోలు, వీడియోలు అన్నీ హ్యాకర్లు చూడగలరు. మీ కాంటాక్ట్ లిస్ట్ దొంగిలించి, మీ పేరుతో ఇతరులకు మెసేజ్ లు పంపి డబ్బులు అడుగుతారు. చివరకు మీ వాట్సాప్ ఖాతాను మీరే వాడలేకుండా వారు లాక్ చేసే ప్రమాదం ఉంది.
సజ్జనార్ సూచించిన జాగ్రత్తలు ఇవే:
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి లేదా అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాటున లింక్ ఓపెన్ చేసినా, మీ వాట్సాప్ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి ‘Linked Devices’ ఆప్షన్ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని కోరారు. అక్కడ మీకు తెలియని లేదా మీది కాని వేరే ఏదైనా డివైజ్ లాగిన్ అయి కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిని ‘Logout’ చేయాలని ఆయన హెచ్చరించారు.
అకౌంట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ ఖాతాలో ‘Two-step verification’ ఫీచర్ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, మన చిన్నపాటి అజాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతుందని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సైబర్ సెక్యూరిటీ పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని, ఈ సమాచారాన్ని తన కుటుంబ సభ్యులు మరియు మిత్రులకు షేర్ చేయడం ద్వారా వారిని కూడా ప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్లో కొత్త మోసం… ‘ఘోస్ట్ పేయిరింగ్’తో జాగ్రత్త!
“హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్.
ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ… https://t.co/SlysOHuA2Q
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 21, 2025