అమీర్పేట్, నవంబర్ 23 : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సనత్నగర్ ప్రభుత్వ పాఠశాల (ఓల్డ్)లో సైబర్ కాంగ్రెస్ వింగ్ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలపై ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నేరగాళ్లు డాటా దొంగిలించడం, అనేక విధాలుగా నష్టాలకు గురి చేసే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ పోలీస్, షీటీమ్స్, యంగిస్తాన్ (ఎన్జీవో) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సోనీ, సంధ్య అనే ఇద్దరు విద్యార్థినులను సైబర్ కాంగ్రెస్ వింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్రెడ్డి, సైబర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఉపాధ్యాయుడు శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
వెంగళరావునగర్ లో..
వెంగళరావునగర్, నవంబర్ 23 : విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాల పై అవగాహన పెంచుకోవాలని ఎస్ఆర్నగర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య సూచించారు. సైబర్ నేరాల పై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ నగరంలోని 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. మంగళవారం వెంగళరావునగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ యాదగిరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంగళరావునగర్ ప్రభుత్వ పాఠశాలలో కావ్య, నవీన్లను అంబాసిడర్లుగా నియమించామన్నారు. జవహర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ అంబాసిడర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి సైబర్ నేరాల పై జూబ్లీహిల్స్ ఎస్సై పీడీ నాయుడు అవగాహన కల్పించారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చిరంజీవి, ప్రధానోపాధ్యాయురాలు పరమేశ్వరమ్మ, ప్రధానోపాధ్యాయులు ధనుంజయ్, ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
బోయిగూడలో..
బన్సీలాల్పేట్, నవంబర్ 23 : విద్యా శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో సెల్ఫోన్ వాడుతున్నారని, వాటిని అడ్డం పెట్టుకుని నేరస్తులు అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్వేత, మానస, హెచ్ఎం శోభ పాల్గొన్నారు.