న్యూయార్క్, డిసెంబర్ 6: పనితీరు బాగాలేదంటూ ఏకంగా 900 మందికిపైగా ఉద్యోగులను తొలగించేశారో భారత సంతతి సీఈవో. అమెరికా మార్ట్గేజ్ సంస్థ బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్.. జూమ్ కాల్లో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తీసేసిన ఉద్యోగుల సంఖ్య.. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 9 శాతానికి సమానంగా ఉండటం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తకు సంబంధించి సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం గత బుధవారం విశాల్.. జూమ్ వెబినార్ను నిర్వహించారు.
ఈ సందర్భంగా పనితీరు బాగాలేదని ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. మార్కెట్లో ఆశించిన స్థాయిలో కష్టపడట్లేదని, నిర్దేశించిన మేరకు వ్యాపారం చేయలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తక్షణమే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నానని ప్రకటించేశారు. ఇదంతా కేవలం 3 నిమిషాల్లోనే జరిగిపోయింది. ‘నా కెరియర్లో ఇది రెండోసారి. మరోసారి ఇలాంటి పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నాను. నిజానికి మొదటిసారైతే నేను ఏడ్చేశాను. ఈసారి మాత్రం ధైర్యంగానే ఉన్నాను. ఇక అసలు విషయానికొస్తే.. మీరు ఈ కాల్లో ఉన్నట్లయితే దురదృష్టవంతులు. మీ ఉద్యోగం పోయింది. ఈ మేరకు హెచ్ఆర్ నుంచి మీకు ఈ-మెయిల్ వస్తుంది.
మీ పనితీరు బాగాలేదు. కొందరైతే 8 గంటలకు 2 గంటలే పనిచేస్తున్నారు. తొలగింపులకు కారణమిదే’ అని ఉద్యోగులకు విశాల్ స్పష్టం చేసినట్లు సీఎన్ఎన్ పేర్కొన్నది. అయితే క్రిస్మస్ పండుగకు ముందు ఇలా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపట్ల సంస్థ సీఎఫ్వో కెవిన్ ర్యాన్ సైతం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, తొలగించిన ఉద్యోగుల్లో డైవర్సిటీ, ఈక్విటీతోపాటు రిక్రూటింగ్ బృంద సభ్యులు కూడా ఉన్నారు.