పనాజీ: బెంగుళూరు స్టార్టప్కు చెందిన మహిళ సీఈవో(Bengaluru CEO) తన నాలుగేళ్ల కుమారిడిని హత్య చేసింది. గోవాలో వెకేషన్ కోసం వెళ్లిన తర్వాత అక్కడ ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే కుమారుడి శరీరాన్ని ఓ సంచిలో పెట్టి తీసుకువెళ్తుండగా ఆమె కారును గోవా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళ్తే..
39 ఏళ్ల సుచనా సేథ్ బెంగుళూరులోని మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీ సీఈవోగా చేస్తున్నారు. తన కుమారుడిని చంపి బ్యాగ్లో పెట్టి తీసుకువెళ్తుండగా సోమవారం కర్నాటకలోని చిత్రదుర్గ్లో ఆమెను పట్టుకున్నారు. నార్త్ గోవాలోని కాండలిమ్లోని ఓ అపార్ట్మెంట్లో ఆమె తన కుమారుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు ఆ హత్య చేయాల్సి వచ్చిందో ఇంకా తెలియదు.
కాండలిమ్లోని బనియన్ గ్రాండ్ హోటల్లోకి ఆమె శనివారం తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అయితే సోమవారం ఆమె ఒంటరిగా చెక్ ఔట్ అయ్యింది. బెంగుళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ స్టాఫ్ను కోరింది. ఫ్లయిట్లో వెళ్లాలని కోరినా ఆమె ట్యాక్సీలోనే వెళ్లేందుకు మొగ్గు చూపింది. అయితే ఆమె కుమారుడి మిస్స్ అయినట్లు హోటల్ సిబ్బంది గుర్తించింది. ఆమె రూమ్ వీడిన తర్వాత ఆ రూమ్లో రక్తపు మరకలు ఉన్నట్లు హౌజ్ కీపింగ్ స్టాఫ్ గుర్తించినట్లు తెలుస్తోంది.
హోటల్ సిబ్బంది వెంటనే గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు ట్యాక్సీ డ్రైవర్కు కాల్ చేశారు. కుమారుడి గురించి చెప్పాలని సీఈవో సుచనాను పోలీసులు ఫోన్లోనే అడిగారు. అయితే ఆమె తన ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చింది. అక్కడ తన కుమారుడు ఉన్నట్లు ఆమె చెప్పింది. కానీ ఆ అడ్రస్ ఫేక్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఈసారి గోవా పోలీసులు డ్రైవర్కు ఫోన్ చేసి కొంకణి భాషలో మాట్లాడారు. సుచనాకు అర్థం కావద్దు అని అలా చేశారు. దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్కు పోలీసులు ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ నేరుగా తన కారును సమీపంలో ఉన్న చిత్రదుర్గ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాడు. ఆ కారులోని ఓ బ్యాగ్లో కుమారుడి శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని భర్త వెంకట రమణకు తెలియజేశారు. ఆయన కూడా ఏఐ డెవలపర్గా పనిచేస్తున్నాడు.
ఈ కేసులో విచారణ నిమిత్తం సుచనాను పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. లింకిడిన్ పేజీ ప్రకారం 100 బ్రిలియంట్ వుమెన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచనా టాప్ ప్లేస్లో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్లు ఆమె లింకిడిన్లో ఉంది. డేటా సైన్స్ టీమ్లకు శిక్షణ ఇవ్వడంలో ఆమెకు 12 ఏళ్ల అనుభవం ఉన్నది.