మెదక్ రూరల్, డిసెంబర్ 9: ఉన్నది ఎకరం భూమి.. దాంట్లో వరి పండిస్తే ఏ మూలకు సరిపోదు. కూరగాయల సాగుతో ఎప్పటికప్పుడు ఆదాయం సంపాదించవచ్చని ఆలోచించాడు.. మెదక్ జిల్లా మాచవరంకు చెందిన రైతు శివయ్య. మరో అరెకరాన్ని కౌలుకు తీసుకొన్నాడు. సేంద్రియ ఎరువులతో పండించి అమ్మితే మంచి లాభం కూడా అని అనుకొని ఆ దిశగా సాగు మొదలు పెట్టాడు. ప్రస్తుతం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మిరపకాయ, బెండకాయ, టమాట, వంకాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర, పాలకూర, కాకరకాయ, బీరకాయ పండిస్తున్నాడు. పశువుల ఎరువు, జీవామృతం, డీ కంపోజ్డ్ ఎరువులు, ఆవుపేడ, ఆవుమూత్రం, వేపపిండి, వేపాకు తదితర ఎరువులను వాడుతూ కూరగాయల సాగు చేస్తున్నాడు. ఒకే రకమైన పంట వేసి నష్టపోకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇతర పంటలు సాగుచేస్తే ఆదాయం వస్తుందని సూచిస్తున్నాడు.