హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వినియోగించుకొని సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తీగారం, బంజర గ్రామాలలోని దళిత వాడలలో దళితబంధు కార్యక్రమం అమలుపై నిర్వహించిన గ్రామ సభలలో మంత్రి పాల్గొన్నారు.
దళిత బంధు కార్యక్రమంలో భాగంగా తీగారం గ్రామంలో 20 మంది, బంజర గ్రామంలో 15 మంది షెడ్యూల్డ్ కులాల కుటుంబాల లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేస్తామని ఆయన తెలిపారు.
లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్చి 7వ తేదీ వరకూ గ్రౌండింగ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఎంపిక చేసిన లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి అని మంత్రి తెలిపారు. మొదటి దశలో ఈనెల 5వ తేదీలోగా ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.