బీజింగ్, నవంబర్ 5: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఒకవైపు సతమతమవుతున్న చైనాను కాలుష్య సమస్య పట్టిపీడిస్తున్నది. బొగ్గు కొరతతో డ్రాగన్ దేశం ఇటీవల తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొన్నది. దీంతో బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని అధికారులు అమాంతం పెంచేశారు. ఫలితంగా బీజింగ్ సహా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్లకు మించి దూరం కనిపించడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీజింగ్, షాంఘై, తియాంజిన్, హార్బిన్ నగరాల్లోని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. స్కూళ్లు, పార్కులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసుల నిర్వహణను తాత్కాలికంగా నిషేధించారు. శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే పీఎం విలువ సాధారణంగా 2.5 ఉండాలి. ప్రస్తుతం చైనాలో అది 230కు చేరుకున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సిఫారసు చేసిన పీఎం స్థాయిలు 15 కంటే ఇది చాలా ఎక్కువ. వాతావరణంలో మార్పులే ప్రస్తుత కాలుష్యానికి కారణమని అధికారులు చెబుతుండగా, ఉత్తర చైనాలో శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా మండించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు.