బంజారాహిల్స్,నవంబర్ 17: నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పౌరుల భద్రత కోసం పోలీసుల చొరవతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు, హౌసింగ్ సొసైటీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు రూ.4కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం సుమారు 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
దీనికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ను జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని స్రవంతి నగర్ కాలనీలో సుమారు 24కెమెరాలు, నందగిరి హిల్స్లో 16కెమెరాలు నవ నిర్మాణనగర్లో 16 కెమెరాలు, న్యాయ విహార్లో 8 కెమెరాలు, జూబ్లీహిల్స్ రోడ్ నెం 10(సి)లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 32 కెమెరాలు, రహ్మత్నగర్లో 68 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటివల్ల ఆయా ప్రాంతాల్లో భద్రతపై భరోసా ఏర్పడింది. ఏ నేరం జరిగినా ఆయా ప్రాంతంలోని సీసీ కెమెరా కంట్లో పడేవారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో పోలీసులు అనుక్షణం సీసీ ఫుటేజీని పరిశీలిస్తూ భద్రతను పర్యవేక్షించేవారు.
సీసీ కెమెరాల మరమ్మతులపై పోలీసుల దృష్టి
మూడురోజుల క్రితం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో సినీనటి షాలూ చౌరాసియా మీద గుర్తుతెలియని దుండగుడు దాడి చేసిన ఘటనలో పార్కు చుట్టూ ఉన్న 64కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడిని గుర్తించలేకపోతున్నారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సీసీ కెమెరాల పనితీరుపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల పనితీరుపై రెండు రోజులుగా పరిశీలన చేస్తున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు పనిచేయడం లేదనే దానిపై వివరాలు సేకరించిన జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి వాటి మరమ్మతులు చేయిస్తున్నారు. దాతల సహకారంతో సీసీ కెమెరాల మరమ్మతులు, కేబుల్స్ కొనుగోలుకు నిధులు సమకూర్చేందుకు కసరత్తు ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ సొసైటీ ప్రాంతంలో పనిచేయని సీసీ కెమెరాల మరమ్మతుల కోసం సుమారు రూ.15లక్షలు అవుతుందని పోలీసులు గురించారు. కెమెరాలను ఏర్పాటు చేసిన సంస్థను సంప్రదించడంతో బుధవారం పనులు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పనిచేయని అన్ని కాలనీ సంక్షేమ సంఘాలను అప్రమత్తం చేస్తామని, వారి సహకారంతో సాధ్యమైనంత త్వరగా సీసీ కెమెరాల మరమ్మతులు పూర్తి చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.