తల్లి కావడం అన్నది ప్రతి స్త్రీ కల. కొందరికి సులభంగానే నెరవేరే ఈ కల, మరికొందరికి మాత్రం కష్టసాధ్యమవుతుంది. ముఖ్యంగా తొలినెలల్లో (12 వారాల్లో) మళ్లీ మళ్లీ జరిగే గర్భవిచ్ఛిత్తి (రికరెంట్ అబార్షన్) వాళ్లను మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తుంది. అయితే, ఇలా జరగడానికి లెక్కకు మిక్కిలి కారణాలున్నాయి. వీటిని సరిగ్గా అంచనా వేయగలిగితే అమ్మ కావడం అన్నది అందరికీ సాధ్యమయ్యే పనే అవుతుంది.
సాధారణంగా మూడుసార్లకు మించి గర్భస్రావం అయితే దాన్ని రికరెంట్ అబార్షన్గా చెబుతాం. ఇటీవలి కాలంలో రెండుసార్లకు మించినా దాన్ని పరిశీలించి అందుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే వీటికి కారణాలను ఎంత విశ్లేషించినా 50 శాతం వరకు మాత్రమే తెలుస్తాయి. అలా తెలుసుకునేందుకు ముందుగా జన్యుపరమైన కారణాలను పరిశీలిస్తాం. మన దగ్గర మేనరికాలు ఎక్కువ కనుక…అలాంటి వాటి వల్ల జరిగిందేమో తెలుసుకోవడానికి ఇవి సాయపడతాయి. గతంలో కేరియోటైప్ అనే పరీక్ష చేసేవాళ్లం. ఇందులో బ్యాలెన్స్డ్ ట్రాన్స్లొకేషన్, నాన్ బ్యాలెన్స్డ్ ఫలితాలు తెలుస్తాయి. బ్యాలెన్స్డ్లో అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ పద్ధతిలో జన్యువుల తేడాలు పూర్తి స్థాయిలో తెలియదు. మరింత లోతుగా తెలుసుకునేందుకు ఇటీవల ఇందుకోసం హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్, మైక్రో ఆరె అనే పరీక్షలు వచ్చాయి. తల్లిదండ్రులకు, అలాగే అబార్షన్ అయిన తర్వాత పిండానికి పరీక్షలు చేసి ఎక్కడ లోపం ఉందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వీటిలో చిన్న తేడాలు కూడా తెలుస్తాయి. కాకపోతే ఇవి ఖరీదు.
డాక్టర్ పి. బాలాంబ,
సీనియర్ గైనకాలజిస్ట్