న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఖాతాదారులతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అలాంటపుడే ఇబ్బందులు లేకుండా రుణాల్ని పొందే ప్రక్రియ అమలవుతుందని బ్యాంక్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే రుణ ప్రతిపాదనలపై అనుసరించాల్సిన ప్రమాణాల్ని విస్మరించవద్దని హెచ్చరించారు. సోమవారం నాడిక్కడ పారిశ్రామికవేత్తలతో జరిగిన బడ్జెట్ తదుపరి సమావేశంలో…ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు, ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారాల మధ్య జరిగిన సంభాషణపై ఆర్థిక మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. బేకింగ్ వ్యాపారానికి సంబంధించిన ఒక స్టార్టప్ మహిళా వాణిజ్యవేత్త.. ఇబ్బందులు లేకుండా బ్యాంక్ల రుణ లభ్యత ఉండాలంటూ చెప్పగా, మూలధనం కోసమే స్టార్టప్ల ఆందోళన అని, తగిన ఈక్విటీ మూలధనం ఉంటే రుణ మద్దతు పూర్తిగా ఉంటుందంటూ ఖారా చెప్పారు. ఈ సంభాషణను విన్న ఆర్థిక మంత్రి ఎస్బీఐ చైర్మన్ సమాధానం నిర్జీవంగా ఉందని, పక్కన ఎవరో చెబితే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ గురించి మాట్లాడారన్నారు. తమ బ్యాంక్ వచ్చే రెండు నెలల్లో పూర్తిగా డిజిటలైజ్ అవుతుందని, ఇకమీదట రుణ వితరణలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తవని ఖరా వివరించారు.
జీఎస్టీని ‘గబ్బర్సింగ్ టాక్స్’ అంటూ విమర్శించడం మన సంస్థల్ని అగౌరవపర్చడమేనని నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ర్టాలు ఉంటాయని, కౌన్సిల్ తీసుకునే నిర్ణయాల్లో కేంద్రం ప్రభావం మూడింట ఒకవంతు మాత్రమే ఉంటుందన్నారు.