35 సెకండ్లలో ఏం చేయగలరని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పేందుకే రెండు మూడు క్షణాలు ఆలోచిస్తాం. అదే బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్)కు ఆ ప్రశ్న వేస్తే క్షణం ఆలోచించకుండా వివిధ ప్రాంతాల నుంచి భారత భూభాగంలోకి వచ్చిన నాలుగు యుద్ధ విమానాలను 25 కిలోమీటర్ల దూరంలోనే ఒకేసారి నాశనం చేస్తానని చెప్పేస్తుంది. బీడీఎల్ సామర్థ్యం తెలుసుకోవాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు. దేశ రక్షణరంగంలో బీడీఎల్ పాత్ర అత్యున్నతం. దేశ రక్షణకు అవసరమైన ఆత్యాధునిక ఆయుధాలను ఈ సంస్థే తయారు చేస్తున్నది. కొన్నింటిని స్వయంగా.. మరికొన్నింటిని డీఆర్డీవో సహకారంతో రూపొందిస్తున్నది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తాను రూపొందించిన వివిధ ఆయుధాలను బీడీఎల్ మంగళవారం ప్రదర్శనకు పెట్టింది. హైదరాబాద్ కంచన్బాగ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో పలు నమూనా యుద్ధ విమానాలు, ఇతర రక్షణ పరికరాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
సెకండ్లలో పనికానిచ్చే ఆకాశ్..
భూ ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది ఈ క్షిపణి. ఒకేసారి నాలుగు విభిన్న ప్రాంతాల నుంచి శత్రువులు చేసే దాడులను నిర్వీర్యం చేస్తుంది. ఆకాశ్ను డీఆర్డీవో డిజైన్ చేయగా.. బీడీఎల్ అభివృద్ధి చేసింది. శత్రువులు ఆకాశమార్గం ద్వారా దేశంపై చేసే దాడిని భూమి పైనుంచే అడ్డుకుంటుంది. శత్రుదేశాలు ఒకేసారి నాలుగు విమానాల ద్వారా దాడి చేసినా.. ఆకాశ్ క్షిపణి సాయంతో ఏకకాలంలో వాటన్నింటినీ నాశనం చేయొచ్చు. ఇది కేవలం 35 సెకండ్లలో 25 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను చేరుకుంటుంది.
స్వీయ రక్షణకు సీఎండీఎస్
కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టం (సీఎండీఎస్). ఇది శత్రు దాడుల నుంచి తప్పించే పరికరం. మన యుద్ధ విమానాలే లక్ష్యంగా వాయుమార్గంలో శత్రువులు ఎవరైనా దాడులు చేసినప్పుడు.. సీఎండీఎస్ వ్యవస్థ శత్రువుల లక్ష్యాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇందుకోసం గాలిలో కృత్రిమ హీట్వేవ్స్, ఇతర ధ్వని తరంగాలను వదులుతుంది. సాధారణంగా ఈ తరంగాల ద్వారానే శత్రువులు మిసైళ్లను గుర్తించి దాడులు చేస్తుంటారు. ఆకాశంలో ఏ మార్గం నుంచి దాడులు జరుగుతున్నాయో సీఎండీఎస్ క్షణాల్లో గుర్తిస్తుంది. వారిని తప్పుదోవ పట్టించి.. బోల్తా కొట్టిస్తుంది.
తొలిసారిగా..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తొలిసారిగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ దేశంలోని 75 బీడీఎల్స్తో పాటు హైదరాబాద్, విశాఖపట్నం యూనిట్లలో సోమవారం వర్చువల్ పద్ధతిలో ఎగ్జిబిషన్లను ప్రారంభించగా.. హైదరాబాద్లోని కంచన్బాగ్ యూనిట్లో మంగళవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మిశ్రా మాట్లాడుతూ.. బీడీఎల్ ప్రాంగణంలో విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శించడం ఇదే తొలిసారని.. సాధారణ ప్రజలు వీటిని చూసేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తయారు చేసిన.. భవిష్యత్లో రూపొందించే ఆయుధాలను ప్రదర్శనకు పెట్టామన్నారు. ఈ నెల 19 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను ఎవరైనా సరే ఉచితంగా చూడొచ్చన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తేవాలన్నారు. ఈ ప్రదర్శన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఎస్ఏఏడబ్ల్యూ
స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ (ఎస్ఏఏడబ్ల్యూ) వాయుమార్గం ద్వారా భూ ఉపరితలంపైన ఉన్న శత్రుస్థావరాలను టార్గెట్ చేస్తుంది. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా వీటిని ఉపయోగిస్తారు. 90 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది.
నీటిలోని బలం.. వరుణాస్త్ర
వరుణాస్త్ర అనేది నౌకా విధ్వంసక ఆయుధం (హెవీ వెయిట్ టార్పెడో). సముద్రం లోపల నుంచి శత్రువులపై ఇది దాడి చేస్తుంది. నీటిలో 8 మీటర్ల నుంచి 600 మీటర్ల లోతులో ఇది ప్రయాణిస్తుంది. నీటిలో గంటకు దాదాపు 48 నుంచి 72 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ ఆయుధం బరువు దాదాపు 1600 కిలోల నుంచి 1850 కిలోలు. శత్రు నౌకలను టార్గెట్ చేసి ధ్వంసం చేయడంలో దిట్ట.
ఎంఆర్ఎస్ఏఎం (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్), వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ భూ ఉపరితలం నుంచి ఆకాశంలోని శత్రు మిసైళ్లను ధ్వంసం చేయగలవు. 4500 మీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం ఎంఆర్ఎస్ఏఎం సొంతం. సబ్మెరైన్ ఫైర్డ్ డెకాయ్ (ఎస్ఎఫ్డీ) అనేది సముద్రంలో ఉండే సబ్మెరైన్పై ఎవరైనా దాడికి యత్నిస్తే.. దాన్ని విఫలం చేస్తుంది. శత్రువులను పసిగట్టి నాశనం చేస్తుంది.
పృథ్వి..
పృథ్వి క్షిపణి భూ ఉపరితలం పై నుంచి భూమిపై ఉన్న శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు. టార్గెట్ను నిర్దేశిస్తే పని పూర్తిచేస్తుంది. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది పనిచేస్తుంది.
అస్త్ర.. ఎయిర్ టు ఎయిర్
అస్త్ర క్షిపణి, లాంచర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇది వాయుమార్గం ద్వారా గాలిలోని (ఎయిర్ టు ఎయిర్) లక్ష్యాలపై దాడి చేస్తుంది. ఈ మిసైల్ కేవలం 100 నుంచి 120 సెకండ్లలో 80 నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యుద్ధ విమానాలను ధ్వంసం చేయగలదు. సుఖోయి (ఎస్యూ 30 ఎంకేఐ) ద్వారా ఈ మిసైల్ను ప్రయోగిస్తారు.
ఎన్ఏజీ మూడో జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఏటీజీఎం). శత్రువుల మిసైల్ ట్యాంకులే దీని లక్ష్యం. 4000 మీటర్ల
దూరంలోని టార్గెట్ను ఛేదించి నాశనం చేస్తుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఇది పనిచేస్తుంది.
కొంకుర్స్- ఎం ఏటీజీఎం
కొంకుర్స్- ఎం ఏటీజీఎం అనేది శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేస్తుంది. పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధ పరికరాలతో వచ్చే వాహనాలను టార్గెట్ చేస్తుంది. 75-4000 మీటర్ల దూరంలోని శత్రువులను నాశనం చేయగలదు. మిలన్ 2టీ ఏటీజీఎంతో పాటు ఇన్వార్ (3 యూబీకే 20) సైతం పేలుడు పదార్థాలతో నిండిన శత్రువుల యుద్ధ ట్యాంకర్లే లక్ష్యంగా పనిచేస్తాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హైదరాబాద్ కంచన్బాగ్లో నిర్వహిస్తున్న మిశ్రాధాతు నిగం లిమిటెడ్ (మిధాని) ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంటున్నది. ఈ నెల 19 వరకు ఈ ప్రదర్శన కొనసాగనున్నది. జెట్ విమానం, యుద్ధ హెలికాప్టర్, పలు రకాల మిసైళ్లతోపాటు, బాంబు షెల్, బుల్లెట్ ప్రూఫ్ మోర్చా తదితరాలు ప్రత్యేకార్షణగా నిలిచాయి.
చలో చూసొద్దాం..
ఆకట్టుకుంటున్న మిధాని ఉత్పత్తుల ప్రదర్శన
సరిహద్దుల్లో సైన్యం వినియోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ప్రదర్శించారు. దీని బరువు 7.1 కిలో నుంచి 9 కిలోల వరకు ఉంటుంది. కార్బన్ను వినియోగించి దీన్ని తయారుచేశారు.
బుల్లెట్ ప్రూఫ్ పట్కా. దీన్ని మిలటరీ, పారా మిలటరీ బలగాలు పెట్టుకుంటాయి. దీని బరువు 1.4 కిలోల నుంచి 1.7 కిలోల వరకు ఉంటుంది.
ప్రదర్శనలో బీడీఎల్ రూపొందించిన బయో ఇంప్లాంట్స్ ఆకట్టుకున్నాయి. సాధారణంగా ఏదైనా ఎముక విరిగినప్పుడు దాని స్థానంలో రాడ్ వేస్తుంటారు. సాధారణంగా మార్కెట్లో ఈ రాడ్ రూ.3 లక్షలు ఉంటుంది. అత్యంత నాణ్యతతో బీడీఎల్ టైటానియంతో తయారుచేసిన రాడ్స్ను ఇక్కడ ప్రదర్శించారు. దీన్ని దాదాపు రూ.50 వేలకే అందజేస్తున్నామని ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. వీటిని ఎక్కువగా ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నామని చెప్పారు.