బుర్జ్ ఖలీఫా భవన నిర్మాణం వెనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బృహత్ లక్ష్యం దాగున్నది. చమురు ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న యూఏఈని ఇతర రంగాలకు విస్తరించాలని ఆ దేశ పాలకులు భావించారు. దాంతో దుబాయ్ పక్కనే ఎడారిలో అనేక అద్భుతాలతో డౌన్టౌన్ పేరుతో ఓ కొత్త నగర నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా బుర్జ్ ఖలీఫాను నిర్మించారు. దీని ఆధారంగా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను భారీగా ఆకర్షించాలనేది లక్ష్యం. అందులో అద్భుత విజయం సాధించారు. ఈ భవనం అసలు పేరు బుర్జ్ దుబాయ్. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో భవన నిర్మాణ సంస్థ ఎమార్ ప్రాపర్టీస్ ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొన్నది. దాంతో నిర్మాణం ఆగిపోయింది. అప్పుడు యూఏఈ పాలకుడు షేక్ ఖలీఫా ఆర్థికసాయం చేసి నిర్మాణం పూర్తయ్యేందుకు తోడ్పాటు అందించారు. దాంతో ఆయన గౌరవార్థం భవనం పేరును బుర్జ్ ఖలీఫాగా మార్చారు.
‘ఏడంతస్తుల మేడ ఉయ్యాలో.. ఎక్కరాదు దిగరాదు ఉయ్యాలో’.. అని పాడుకునే బతుకమ్మ ఇయ్యాల నూటా అరవై మూడు అంతస్తులెక్కింది. ‘ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో.. ఏరడ్డమాయె ఉయ్యాలో’.. అని ఆడుకునే బతుకమ్మసముద్రాలు దాటి బుర్జ్ ఖలీఫాకు వెళ్లింది. ఎడారిపూలతో తంగేడు పూలు జతగూడి మెరిశాయి. ప్రపంచంలోనే ఎత్తయిన భవంతి.. బతుకమ్మ విరాట్ రూపం ముందు చిన్నబోయింది. ‘అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురువగా’ పాట ప్రతిధ్వనుల మధ్య బతుకమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది!
ఇది కదా వైభవం. ఇది కదా అసలైన ఉత్సవం. రికార్డుల కోట మీద బతుకమ్మ పాట సగర్వంగా ప్రదర్శితమైంది. బుర్జ్ ఖలీఫా.. ఆకాశంలోకి చొచ్చుకుపోతున్నట్టు కనిపించే ఆ అందాల భవంతి ఎత్తు అక్షరాలా.. 829.8 మీటర్లు (2,722 అడుగులు). పదకొండేండ్ల క్రితం ఈ బుర్జ్ ప్రాణంపోసుకుంది. ఇక్కడినుంచే శనివారం రాత్రి బతుకమ్మ పాట పల్లవించింది. తెలంగాణ జాగృతి అల్లిన ‘అల్లిపూల వెన్నెల’ పాట ఎడారి దేశంలోని తడారిన గొంతుల్లో స్వరాల అమృతాన్ని పోసింది. వరాల బతుకమ్మ వైభవాన్ని తరాల వరకూ తలుచుకునేలా చేసింది. తెలంగాణ బతుకమ్మ ఇక గ్లోబల్ బతుకమ్మ!
దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాను అమెరికాకు చెందిన ఎస్ఓఎమ్ (స్కిడ్మోర్, ఒవింగ్స్ అండ్ మెరిల్) అనే సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ డిజైన్ చేశారు. నివాసంగా, కార్పొరేట్ ఆఫీస్గా, హోటల్ స్పేస్గా ఉపయోగపడేలా నిర్మించారు. బుర్జ్ ఖలీఫా మొత్తంగా 163 అంతస్తుల భవనం. ఆర్కిటెక్చర్, డిజైన్, ఎయిర్ కండిషనింగ్, పంపింగ్ సిస్టమ్, విండో క్లీనింగ్, ఫౌంటెయిన్, 27 ఎకరాల్లో నిర్మించిన సువిశాలమైన పార్క్… ఇందులో అన్నీ ప్రత్యేకమే. టవర్ చుట్టూ ఏర్పాటు చేసిన పార్కును ఎడారి పువ్వు.. హైమినోకాలిస్ (స్పైడర్ లిల్లీ) ఆకారంలో డిజైన్ చేశారు. మధ్యలో వాటర్ రూమ్ ఉంటుంది. అందులో వరుసగా పూల్స్, వాటర్ జెట్ ఫౌంటెయిన్లు చూపరులను కట్టిపడేస్తాయి.
అత్యంత ఎత్తయిన భవనంపై అద్భుత దృశ్యాన్ని వీక్షించడం అతిగొప్ప అనుభూతి. ఆ అనుభవాన్ని ప్రపంచానికి అందించాలనుకుంది బుర్జ్ ఖలీఫా యాజమాన్యం. ఆ ప్రయత్నంలో భాగంగా టవర్పై లైటింగ్, వీడియో, సౌండ్ ఏర్పాటు చేయాలనుకుంది. వాటర్ పార్క్కు మ్యూజికల్ ఫౌంటెయిన్స్ జత చేసేందుకూ సిద్ధమైంది. సాంకేతిక సాయం కోసం సాకో కంపెనీని సంప్రదించింది. టవర్పై లక్ష చదరపు మీటర్లకు మించిన పరిమాణంలో భారీ ఎల్యీడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద తెర ఇది. కొన్నేండ్ల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో మొదలైన ఈ లైట్ షో తర్వాత తర్వాత వివిధ కార్యక్రమాలకు వేదికగా మారింది. వీడియో, లైట్, సౌండ్ షో చూసేందుకు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. బుర్జ్ ఖలీఫాలో జరిగిన కొత్త సంవత్సర సంబురాల్లో ‘లైట్ అప్ 2018’ గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. రోజూ సాయంత్రం నిర్వహించే వాటర్ కొరియోగ్రాఫ్డ్ ఫౌంటెయిన్ షో కూడా బుర్జ్ ఖలీఫా ప్రత్యేకతే.
బుర్జ్ ఖలీఫాపై భారతీయ మువ్వన్నెల జెండా చాలాసార్లే ఎగిరింది. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున మహాత్ముడి చిత్రాన్ని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను ప్రదర్శించారు. భారతదేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో జనంలో ధైర్యాన్ని నింపేందుకు బుర్జ్ ఖలీఫాపై ‘హ్యాష్ట్యాగ్ స్టే స్ట్రాంగ్ ఇండియా’ అన్న అభయాక్షరాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ధరిస్తున్న కొత్త జెర్సీని ఇటీవల బుర్జ్ ఖలీఫాపై దృశ్యమానం చేశారు. ఇప్పుడు, తెలంగాణ పండుగ బతుకమ్మను పరిచయం చేయడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవమే.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడంలో తెలంగాణ జాగృతి కృషి జగద్విదితం. ఉద్యమ సమయంలో బతుకమ్మ పండుగ ద్వారా సామాన్య మహిళల్లోనూ పోరాట స్ఫూర్తిని నింపింది. ఈ ఏడాది
పండుగ పాటను.. వినసొంపైన స్వరాలతో, కనువిందైన దృశ్యాలతో డాక్యుమెంటరీగా విడుదల చేశారు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటను చిత్రీకరించారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఆ పాటే ఇప్పుడు బుర్జ్ ఖలీఫా సాక్షిగా ప్రతిధ్వనించింది.