హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి 141 మున్సిపాలిటీల్లో రెండు దశల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన మౌలిక సదుపాయాలను పురపాలకశాఖ, వైద్య పరికరాలను వైద్యశాఖ, సాంకేతిక సహకారాన్ని ఐటీ శాఖ సమకూర్చనున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కలిసి బస్తీ దవాఖానల ఏర్పాటుపై మంగళవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్చార్డీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు జీహెచ్ఎంసీలో నెలకొల్పిన 256 బస్తీ దవాఖానలు పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని చెప్పారు. కొత్తగా నెలకొల్పనున్న వాటితో కలిపి రాష్ట్రంలో బస్తీ దవాఖానల సంఖ్య 544కు పెరుగుతుందని చెప్పారు. జనాభా, వైద్యసేవల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని బస్తీదవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖానల్లో టీ-డయాగ్నొస్టిక్స్ సహకారంతో రోగ నిర్ధారణ కోసం ఎకడికకడే శాంపిల్స్ సేకరిస్తామని చెప్పారు. దీంతో ఉచిత వైద్యం, ఉచిత మందులు లభించడంతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలకు చేసే ఖర్చు కూడా పేదలకు తప్పుతుందని వివరించారు.
వైద్యారోగ్యశాఖకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసిన ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానం సాధించడం పట్ల పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు, ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది ఆరోగ్య సూచీలో తెలంగాణ అగ్రస్థానం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని బస్తీ దవాఖానలు : 256
కొత్తగా 141 మున్సిపాలిటీల్లో : 288
కొత్తవాటితో కలిపి మొత్తం : 544