ముంబై, ఫిబ్రవరి 22: దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 6.6 శాతంగానే నమోదు కావచ్చని విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో వృద్ధిరేటు 8.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. క్యూ3 గణాంకాలను ఈ నెల 28న జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేయనున్నది. ఈ క్రమంలోనే బార్క్లెస్ పైవిధంగా స్పందించింది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 10 శాతంగా ఉండొచ్చని గతంలో బార్క్లేస్ అంచనా వేసింది. అయితే తాజా అంచనా ఇంతకంటే తక్కువ ఉండటం గమనార్హం. అక్టోబర్-డిసెంబర్లో కరోనాకు ముందున్న స్థాయిలో వివిధ రంగాల పనితీరు నమోదైనా.. జనవరిలో కరోనా థర్డ్ వేవ్ రావడం అంచనాలను ప్రభావితం చేసింది. ఇదిలావుంటే తయారీ రంగం కంటే సేవల రంగమే దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడగలదని బార్క్లేస్ ఈ సందర్భంగా అంచనా వేయడం విశేషం. గనులు, నిర్మాణ, తయారీ రంగాల్లో ప్రగతి నెమ్మదించినట్టు పేర్కొన్నది. అయినప్పటికీ ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో జీడీపీ బాగానే నమోదు కావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.