Bank holidays : దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల (Bank Account Holders) కు సెప్టెంబర్ 11 నుంచి వరుసగా మూడునాలుగు రోజులపాటు బ్యాంకు సేవల (Bank services) కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం, దానికి వరుస సెలవులు జత కలవడమే ఇందుకు కారణం. దాంతో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ముందుగానే తమ పనులను పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. తమ ప్రధాన డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టనుంది. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 12 రెండో శనివారం, సెప్టెంబర్ 13 ఆదివారం సాధారణ సెలవులు. ఇక సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
దాంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది. దీనిపై 2024 లోనే సూత్రప్రాయ అంగీకారం కుదిరినప్పటికీ.. అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. దాంతోపాటు సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని సమీక్షించాలని, పెన్షన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాయి.
ఈ విషయమై సెప్టెంబర్ 9న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో సమ్మెను వాయిదా వేయాలని అధికారులు కోరినా, స్పష్టమైన హామీ లభించకపోవడంతో యూనియన్లు అందుకు నిరాకరించాయి. డిమాండ్లు నెరవేరనిపక్షంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని యూఎఫ్ బీయూ హెచ్చరించింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టంచేసింది.
ఈ నేపథ్యంలో ఖాతాదారులు నగదు డిపాజిట్లు, విత్డ్రాలు, చెక్కుల క్లియరెన్స్, రుణ సంబంధిత పనులు వంటివి సెప్టెంబర్ 11 లోపే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకులు తెలిపాయి. అయినప్పటికీ కొన్ని ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత ఏర్పడే అవకాశం లేకపోలేదు.