ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అదరగొట్టింది. తాము మనసు పెట్టి ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించగలమని మరోమారు నిరూపించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ చెన్నై సూపర్ కింగ్స్కు చెక్ పెట్టింది. హ్యాట్రిక్ ఓటములకు ఫుల్స్టాప్ పెడుతూ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మహిపాల్ లామ్రోర్, డుప్లెసిస్ రాణింపుతో పోరాడే స్కోరు అందుకున్న ఆర్సీబీ..హర్షల్ పటేల్, మ్యాక్స్వెల్ వికెట్ల వేటతో అద్భుత విజయాన్నందుకుంది. ధోనీ కెప్టెన్సీతో దశ మారిందనుకున్న చెన్నై ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
పుణె: ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. లీగ్లో రెండు మేటి జట్ల మధ్య పోరు ఫ్యాన్స్కు ఫుల్మీల్స్ అందించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్పై విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్ల్లో 6 విజయాలతో ఆర్సీబీ నాలుగో స్థానానికి దూసుకెళ్లగా, చెన్నైకి ‘ఏడు’పే మిగిలింది. తొలుత మహిపాల్ లామ్రోర్ (27 బంతుల్లో 42, 3ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ డుప్లెసిస్ (22 బంతుల్లో 38, 4ఫోర్లు, సిక్స్) రాణింపుతో నిర్ణీత 20 ఓవర్లలో 173/8 స్కోరు చేసింది. మహీశ్ తీక్షణ (3/27), మొయిన్ అలీ (2/28) ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వె (37 బంతుల్లో 56, 6 ఫోర్లు, 2 సిక్స్లు), అలీ (27 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. హర్షల్ పటేల్ (3/35) మూడు వికెట్లతో అదరగొట్టగా, మ్యాక్స్వెల్ (2/22) రెండు వికెట్లు తీశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించిన హర్షల్ పటేల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. గురువారం ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
బెంగళూరు: 20 ఓవర్లలో 173/8(లామ్రోర్ 42, డుప్లెసిస్ 38, తీక్షణ 3/27, అలీ 2/28), చెన్నై: 20 ఓవర్లలో 160/8(కాన్వె 56, అలీ 34, హర్షల్ పటేల్ 3/35, మ్యాక్స్వెల్ 2/22)