న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భారత్పై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 20 యూట్యూబ్ చానళ్లు, రెండు న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ఆయా సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటనలో పేర్కొన్నది. ఈ యూట్యూబ్ చానళ్లు, వెబ్సైట్లు పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్టు గుర్తించామని తెలిపింది. వీటిల్లో కశ్మీర్, భారత ఆర్మీ, దేశంలోని మైనార్టీ కమ్యూనిటీలు, రామ మందిరం, ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ తదితర భారత్కు చెందిన సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారంతో కూడిన వ్యతిరేక వార్తలు పోస్టు చేస్తున్నాయని పేర్కొన్నది.