ఉలన్బాతర్(మంగోలియా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. స్టార్ రెజ్లర్ రవి దహియా పసిడి పతకంతో మెరిశాడు. ఆసియా చాంపియన్షిప్లో హ్యాట్రిక్ స్వర్ణాలు కొల్లగొట్టిన తొలి భారత రెజ్లర్గా రవి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 57కిలోల ఫైనల్ బౌట్లో రవి..రఖ్హత్ కల్జాన్(కజకిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు.
ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ హర్యానా యువ రెజ్లర్ పట్టు వదలకుండా ప్రత్యర్థిపై కీలక పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ఆరుసార్లు రెండేసి పాయింట్లు దక్కించుకుని ప్రత్యర్థిని ఉడుం పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. అంతకుముందు జరిగిన సెమీస్ బౌట్లోనూ రవి..జపాన్ రెజ్లర్ రికుటో అరాయిని 12-5తో చిత్తుగా ఓడించాడు. ఆదిలో కొంత తడబడ్డా ఆ తర్వాత తనదైన పట్టుతో బౌట్ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. మిగతా బౌట్లలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత బజరంగ్ పునియా..రెహమాన్ మౌసా(ఇరాన్) చేతిలో ఓడి రజత పతకంతో సంతృప్తిపడ్డాడు.
ఆసియా టోర్నీలో బజరంగ్కు ఇది ఎనిమిదో పతకం. పురుషుల 79కిలోల తుదిపోరులో గౌరవ్ బలియాన్..అలీ బక్తియార్(ఇరాన్) చేతిలో పోరాడి ఓడి వెండి పతకం దక్కించుకున్నాడు. వాస్తవానికి గౌరవ్ 8-0తో ఆధిక్యం కనబరిచినా..ఇరాన్ రెజ్లర్ అద్భుతంగా పుంజుకుని బౌట్ను తన వశం చేసుకున్నాడు. నవీన్(70కి), సత్యవర్త్ కదియాన్(97కి) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. టోర్నీలో భారత్ ఇప్పటి వరకు 15 పతకాలు ఖాతాలో వేసుకుంది.