కొత్తగూడెం, నవంబర్ 16: బాలల హక్కుల గురించి వారికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా కొత్తగూడెం క్లబ్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను మంగళవారం ఆయన ప్రారంభించారు. తొలుత పిల్లలతో కలిసి బెలూన్లు, పావురం ఎగురవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలలపై అఘాయిత్యాలు, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు జరిగిన సందర్భంగా చైల్డ్లైన్ 1098కు గానీ, డయల్ 100కు గానీ కాల్ చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు.
నమ్మకంతోనే మోసం
నమ్మకంతోనే బాలలను మోసం చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో ఆటలు, బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు తదితర అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న బాలలకు ప్రశంసా పత్రాలు అందించారు. అంగన్వాడీ సేవలను ఆన్లైన్ చేసేందుకు మంజూరైన స్మార్ట్ఫోన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. డీడబ్ల్యూవో వరలక్ష్మి, జడ్పీ సీఈవో విద్యాలత, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అంబేద్కర్, సాధిక్పాషా తదితరులు పాల్గొన్నారు.