అమరావతి : సినీ పెద్దల కోరిక మేరకు ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతోందంటూ విమర్శలు చేస్తున్నారని.. చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
మంత్రిగా పని చేసిన అయ్యన్న పాత్రుడు సీఎం జగన్, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. మంత్రిగా పని చేసిన వ్యక్తి వయసుకు తగ్గ మాటలు మాట్లాడకుండా దిగజారుడు మాటలు మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. సీఎం జగన్, మంత్రులపై మాట్లాడాల్సిన అవసరం ఆయనకేముందని ప్రశ్నించారు. ఏం పీకుతారని అన్నారని.. ఇంకా ఏం పీకాలని ప్రశ్నించారు. అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవి, చంద్రబాబు సీఎం పదవి, లోకేశ్ మంత్రి పదవి జనాలు పీకేసినా.. అయ్యన్న ఇంకా ఏం పీకాలని కోరుకుంటున్నారని విమర్శించారు.