పచ్చదనం అంటే ఆయనకు ప్రాణం. ఆ పచ్చదనాన్ని పెంచేందుకు వనాన్ని ఏర్పాటు చేసి అదే జీవనాధారం చేసుకున్నాడు. తనకున్న వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నాడు. అంటుగట్టే విధానం ద్వారా వందల మొక్కలకు ప్రాణం పోస్తూ వనరక్షకుడిగా, వన మిత్రుడిగా పేరు సంపాదించుకున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కూరగాయల అయిలయ్య అనే రైతు పలు రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతూ వనాన్ని సృష్టించాడు.
మొక్కలంటే ఆయనకు ప్రాణం.. మొక్కలకు కూడా ఆయనంటే ప్రాణమే.. ఉదయం లేచింది మొదలు, చీకటి పడేవరకూ మొక్కల పెంపకమే ఆయన వ్యాపకం. వందలకొద్దీ మొక్కలు, చెట్లను పెంచుతూ ఈ ప్రాంతంలో వన సంపదకు సృష్టిగా మారాడు. చదివింది పెద్ద బాలశిక్ష అయినప్పటికీ చెట్లు అంటుగట్టే విధానం నేర్చుకుని వాటిద్వారా రకరకాల ఫలాలను సైతం అందిస్తున్నాడు. అలాగే, ఆరోగ్యం, ఆహారానికి ఉపయోగపడే పలు రకాల మొక్కలను పెంచుతూ తన వ్యవసాయ క్షేత్రాన్ని వనంగా మార్చాడు. ఒకనాడు నెత్తిన కూరగాయలు విక్రయిస్తూ ప్రారంభమైన జీవితం నేడు హుస్నాబాద్ ప్రాంతంలో ఓ పెద్ద వనాన్ని తయారుచేసి వనమిత్రుడిగా పేరు సంపాదించాడు. ఆయనే కూరగాయల (దొంతరబోయిన) అయిలయ్య. ఈ ప్రాంతంలో 40 ఏండ్లుగా వన నిర్మాణమే ప్రాణంగా బతుకున్న అయిలయ్య వనంపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 4 : రకరకాల మొక్కలు చూడాలనుందా.. ఏ కాలంలోనైనా ఒక పండును పొందాలని ఉందా.. ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వచ్ఛమైన గాలిని పీల్చాలని ఉందా.. ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరగాలనుందా.. ఇంకేందుకు ఆలస్యం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని కూరగాయల అయిలయ్య వనాన్ని సందర్శిస్తే చాలు. పలు రకాల పండ్ల, పూల మొక్కలతో పాటు ఆహారానికి ఉపయోగపడే పలు రకాల మొక్కలు దర్శనమిస్తాయి.
నెత్తిమోపుతో కూరగాయల విక్రయం..
హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లికి చెందిన అయిలయ్య తనకున్న కొద్దిపాటి భూమిలో కూరగాయలను పండిస్తూ.. ఇంటింటికీ తిరుగుతూ విక్రయించేవాడు. ఇలా కూరగాయలు అమ్మడం ద్వారా వచ్చిన సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. తాను పండిస్తున్న కూరగాయల విక్రయాలు ఎక్కువగా పెంచాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి ప్రాంతానికి వెళ్లిన సందర్భంలో ఆ ప్రాంతంలో తోటలకు సంబంధించిన మొక్కలు విరివిగా ఉండటం ఆకర్షించింది. దాంతో బత్తాయి, మామిడి మొక్కలను హుస్నాబాద్కు తీసుకువచ్చి నర్సరీకి శ్రీకారం చుట్టాడు. వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలకు వెళ్లి మామిడి మొక్కలకు అంటుగట్టే పద్ధతిని నేర్చుకున్నాడు. తన నర్సరీలో మామిడి, జామ తదితర మొక్కలకు అంటుగట్టడమే కాకుండా హుస్నాబాద్తో పాటు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్, జనగామ, జగిత్యాల తదితర జిల్లాలో మామిడితోటల నిర్మాణానికి పునాదులు వేశాడు.
వనాన్ని సృష్టించాడు..
కూరగాయల విక్రయాలతో సంపాదించిన భూమిని అయిలయ్య ఒక పెద్ద వనంలా తీర్చిదిద్దాడు. వివిధ ప్రాంతాల్లో తీసుకువచ్చిన పలు రకాల మొక్కలను పెంచడమే కాకుండా స్వయంగా తాను మొక్కలకు అంటుగడుతూ తన క్షేత్రాన్ని పెద్ద వనంలా తీర్చిదిద్దాడు. ఎకరం పైగా ఉన్న వ్యవసాయ భూమిలో పలు రకాల చెట్లను పెంచుతూ ఈ ప్రాంతవాసులకు మొక్కలు లభించే క్షేత్రంగా మార్చాడు. మొక్కలను తన కుటుంబ సభ్యులవలే చూసుకుంటూ ఆ క్షేత్రంలోనే ఉదయం నుంచి రాత్రివరకు గడుపుతుంటాడు. అయిలయ్య 2001లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చేతులమీదుగా వనమిత్ర అవార్డు అందుకున్నాడు. పలు సంస్థల చేతుల మీదుగా కూడా అవార్డులు, సన్మానాలు సైతం అందుకున్నాడు.
నోరూరించే పండ్ల మొక్కలు.. ఆరోగ్యాన్ని రక్షించే ఆకులు..
అయిలయ్యకు చెందిన వనంలో పెంచుతున్న చెట్లను చూడాలంటే రెండు కండ్లు చాలవు. పండ్లు, పూలు, పలు రకాల ఆకులు ఇక్కడ దర్శనమిస్తాయి. పలు రకాల మామిడి కాయలు, మూడుఫీట్ల ఎత్తులోనే పెరిగే జామ, ఆరటిచెట్లు, తెల్లటి అల్లనేరేడు, క్రికెట్ బాల్లాంటి సపోట, ఎర్రచందనం, శ్రీగంధం, పాలచెట్టు, మనీ ప్లాంట్, పలు రకాల ఉసిరి, బత్తాయి, డబుల్ మందార పువ్వులు, పిప్పల్ల తీగ, తమల పాకులు ఇలా ఎన్నోరకాల పండ్లు, పూలు, ఆహారంలో ఉపయోగించే చెట్లు మనకు ఇక్కడ కనిపిస్తాయి.
చెట్లు పెంచినవాడు ఎన్నడూ చెడిపోడు
చెట్లు పెంచినోడు ఎన్నడూ చెడిపోడు. మొక్కలు అందరికీ మేలు చేస్తాయని తెచ్చి పెట్టిన. ఎంత కష్టమైనా వీటిని ఇడవను. చిన్నప్పుడు కూరగాయలు అమ్మి బాగుపడ్డ. ఇప్పుడు చెట్లు పెంచి కూడా బాగుపడ్డ.. నా కుటుంబాన్ని కూడా బాగుచేసుకున్న. మొక్కలు ఇక్కడికి తెచ్చిన తర్వాతనే చాలామంది తీసుకుపోయి తోటలు పెట్టుకున్నారు. ఎంతోమంది రోజూ ఇక్కడకి వచ్చి సంతోషపడుతారు. మొదట అందరూ ఎక్కిరించిండ్రు. ఇప్పుడు మంచిపని చేసినావు అయిలయ్య అంటండ్రు. నేను బతుకుడు కాదు. అందరూ బతికే గాలిని ఇస్తుందని సంతోషపడుతున్నా. అందరూ మంచిగుండాలని నా తపన.
అయిలయ్య క్షేత్రంలో లభించే పలు రకాల మొక్కలు..
అయిలయ్య క్షేత్రంలో పలు రకాల మొక్కలు లభిస్తాయి. బంగినపల్లి, మల్లిక, దశేరి, రాయల్ స్పెషల్, లాల్మోహన్ లాంటి మామిడి మొక్కలు ఉన్నాయి. కిలోసైజు పెరిగే జామ, హైబ్రీడ్జామ, ఎర్రజామ, కాలపత్తి సపోట, సీతాఫలం, అరటి, బత్తాయి, రంగాపూర్నిమ్మ, నిమ్మ, తెల్ల అల్లనేరేడు, తమల పాకులు, ఉసిరి, పిపల్ల తీగ, వైట్ ఆపిల్, అంజీర్, ఉసిరి, ఎర్రచందనం, శ్రీగంధం, మనీప్లాంట్, భాగం, కొబ్బరి, రుద్రాక్ష, మల్లిక, బొప్పాయి, యాలకులు, మసాల చెట్టు, మిరియాలతో పాటు పలు రకాల మొక్కలు ఈయన క్షేత్రంలో ఉన్నాయి.