వెస్టిండీస్తో ఆదివారం ముగిసిన రెండో వన్డేలో తన వీరోచిత ఆటతో భారత్కు విజయాన్ని అందించాడు ఆలౌరౌండర్ అక్షర్ పటేల్. ఈ ఎడం చేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో 3 బౌండరీలు, 5 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అక్షర్.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న 17 ఏండ్ల రికార్డును బద్దలుకొట్టాడు.
ధోని.. 2005లో జింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి భారత్కు విజయాన్ని అందించే క్రమంలో 3 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఆ రికార్డును అక్షర్ చెరిపేశాడు. వెస్టిండీస్తో రెండో వన్డేలో అక్షర్ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఏకంగా ఐదు సిక్సర్లు బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు.
ధోని రికార్డును టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ రెండుసార్లు సమం చేశాడు. 2011లో సౌతాఫ్రికా, ఐర్లాండ్పై మ్యాచ్లు ఆడుతూ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మూడు సిక్సర్లు కొట్టాడు. తాజాగా అక్షర్ కొట్టిన ఐదు సిక్సర్లతో ఈ రెండు రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.
ఇదిలాఉండగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇక సిరీస్లో చివరిదైన మూడో వన్డే బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగనుంది.