ప్రకృతికి, మానవాళికి ఉన్న సంబంధం చాలా గొప్పదని, ఆ విషయాన్నే తాను ‘అవతార్-2’లో చూపించానని అన్నారు దర్శకుడు జేమ్స్ కెమెరూన్. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అవతార్-2’ ‘ది వే ఆఫ్ వాటర్’ అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు జేమ్స్ కెమెరూన్.
ఓ అంతర్జాతీయ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ ‘అవతార్ సీక్వెల్ కోసం ఎన్నో సంవత్సరాలుగా శోధన చేశాను. అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టా. సినిమా తీసే ముందు అనేక డాక్యుమెంటరీలు సిద్ధం చేశా. ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించి ప్రేక్షకులకు గొప్ప అనుభవాన్ని అందించాలని ప్రయత్నించాను. మేము పడిన కష్టమంతా తెరపై కనిపిస్తున్నది’ అని అన్నారు.
2 రోజుల్లోనే రూ.వంద కోట్లు : ‘అవతార్-2’ సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమా విడుదలైన 2 రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే మొదటి వారంలో ఈ సినిమా సుమారు 300 కోట్ల రూపాయలు ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నారు.