హైదరాబాద్, నవంబర్ 8: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న అరబిందో ఫార్మా లాభాలకు ముడి సరుకుల ధరలు గండికొట్టాయి. గత త్రైమాసికపు కన్సాలిడేటెడ్ నికర లాభంలో 13.69 శాతం తగ్గింది. 2020-21లో రెండో త్రైమాసికంలో రూ.807.25 కోట్లుగా ఉన్న లాభం గత త్రైమాసికానికిగాను రూ.696.71 కోట్లకు పడిపోయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.6,483.44 కోట్ల నుంచి రూ.5,941.92 కోట్లకు తగ్గింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో అన్ని విభాగాలు భారీ వృద్ధిని నమోదు చేసుకున్నాయని, క్రమంగా ఫార్మా రంగం కుదుటపడుతున్నదన్నారు. ముడి సరుకుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం, లాజిస్టిక్ ఖర్చు లు కూడా అధికమవడం వల్లనే లాభాలపై ప్రభావం చూపిందన్నారు. అమెరికాలో ఔషధాల విక్రయించడంతో రూ.2,967 కోట్లు, యూరప్లో రూ.1,662 కోట్లు, ఇతర అభివృద్ధి చెందిన మార్కెట్ల నుంచి మాత్రం రూ.386.30 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, ప్రతిషేరుకు రూ.1.50 మధ్యంతర డివిడెండ్ను బోర్డు ప్రకటించింది.