బ్యాంకాక్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మార్ మాజీ స్టేట్ కౌన్సెలర్ ఆంగ్సాన్ సూచీకి మరో నాలుగేండ్లు జైలు శిక్ష పొడిగిస్తూ సోమవారం అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. చట్ట విరుద్ధంగా వాకీటాకీలను కలిగి ఉండటం, కరోనా నిబంధనలను ఉల్లంఘించడం వంటి నేరాల కింద దోషిగా తేలడంతో ఈ శిక్ష విధించింది. అక్కడి మిలిటరీ ప్రభుత్వం ఆమెపై దాదాపు డజన్ పైగా కేసులు బనాయించింది. వాటిల్లో ఆమె దోషిగా తేలితే వందేండ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది. గతేడాది ఫిబ్రవరిలోప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సూచీతో పాటు నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను మిలిటరీ ప్రభుత్వం అరెస్టు చేస్తూనే ఉంది. గత నెలలో కూడా ఆమెపై రెండు కేసులు నమోదు చేసి నాలుగేండ్ల జైలు శిక్ష విధించారు. అది ముగియక ముందే తాజాగా మరో నాలుగేండ్లు శిక్ష వేశారు.