హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ 50వ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ టోర్నీకి తెరలేచింది. స్థానిక సరూర్నగర్ స్టేడియం వేదికగా మంగళవారం టోర్నీ అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా త్వరలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టోర్నీని ఘనంగా నిర్వహిస్తున్నామని జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ తొలి మ్యాచ్లో తెలంగాణ మహిళల జట్టు 27-12 తేడాతో పుదుచ్చేరిపై ఘన విజయం సాధించింది. వచ్చే నెల 3 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పోటీ పడుతున్నాయి.