‘మంచి ప్రయత్నానికి ప్రేక్షకాదరణ ఉంటుందని మరోసారి మా సినిమా రుజువుచేసింది. చక్కటి ఓపెనింగ్స్ లభిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు ఆదిసాయికుమార్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అతిథిదేవోభవ’. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. నాకు, రోహిణికి మధ్య వచ్చే సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తున్నాయని ప్రశంసిస్తున్నారు. నా నటన బాగుందని చెబుతుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ప్రథమార్థంలో వినోదం, ద్వితీయార్థంలో భావోద్వేగాలు మెప్పిస్తున్నాయని చెబుతున్నారని, ప్రతి చోట వసూళ్లు బాగున్నాయని దర్శకుడు చెప్పారు. తమ తొలి ప్రయత్నం విజయవంతమవ్వడం ఆనందంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు.