కొలంబో: కరోనా కారణంగా రెండేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆసియా కప్ (టీ20) టోర్నమెంట్కు మోక్షం లభించింది. షెడ్యూల్ ప్రకారం 2020లో జరుగాల్సిన ఈ టోర్నీని.. ఆగస్టు 27 నుంచి లంక వేదికగా నిర్వహించనున్నట్లు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) వెల్లడించింది. 16 రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్తో పాటు క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటిన మరో జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు శనివారం జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జై షా పదవీ కాలం పొడిగింపు
ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న బీసీసీఐ కార్యదర్శి జై షా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. గతేడాది బంగ్లా బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హుసేన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన జై షా.. 2024 ఏజీఎం వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.