ఢాకా: ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన కీలక పోరులో భారత్ 4-3 తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో టీమ్ఇండియా..పాక్ను ఓడించి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రౌండ్ రాబిన్ దశలో అత్యుత్తమ ప్రదర్శనతో టాప్లో నిలిచి సెమీస్లో జపాన్ చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న భారత్..పాకిస్థాన్తో మ్యాచ్లో ప్రాణం పెట్టి ఆడింది.
డిఫెండింగ్ చాంపియన్గా టైటిల్ చేజార్చుకున్న కసితో కనిపించిన మన్ప్రీత్సింగ్ సారథ్యంలోని టీమ్ఇండియా 11 పెనాల్టీకార్నర్లు దక్కించుకుని రెండింటిని సద్వినియోగం చేసుకుంది. భారత్ తరఫున హర్మన్ప్రీత్సింగ్(2ని), సుమిత్(45ని), వరుణ్(53ని), ఆకాశ్దీప్(56ని) గోల్స్ చేశారు. మరోవైపు పాక్ జట్టులో అర్ఫాజ్(10ని), రానా(33ని), నదీమ్(57ని) గోల్స్ కొట్టారు. మ్యాచ్ విషయానికొస్తే ఆరంభంలో హర్మన్ప్రీత్సింగ్ గోల్తో భారత్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది. జపాన్తో మ్యాచ్ తరహాలో గాకుండా పాక్తో పోరులో భారత ప్లేయర్లు మొదటి నుంచే దూకుడు కనబరిచారు. పాక్ డిఫెన్స్ లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగారు.
ఈ క్రమంలో పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ గోల్గా మలిచి స్కోరు ఖాతా తెరిచాడు. అయితే పదో నిమిషంలో భారత డిఫెన్స్ను ఛేదిస్తూ అర్ఫాజ్ గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇరు జట్ల మధ్య తొలి రెండు క్వార్టర్లు హోరాహోరీగా జరిగాయి. మూడో క్వార్టర్ మొదలైన మూడో నిమిషానికే రానా గోల్తో పాక్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 45వ నిమిషంలో గురుభక్షిత్సింగ్ అందించిన పాస్ను సుమిత్ గోల్ కొట్టడంతో స్కోరు 2-2తో సమమైంది. ఇక్కణ్నుంచి మరింత దూకుడు కనబరిచిన భారత్ అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకుంది. మూడు నిమిషాల తేడాతో వరుణ్, ఆకాశ్దీప్ గోల్స్ కొట్టడంతో పాక్పై భారత్ విజయం ఖరారైంది.
చాంపియన్ కొరియా
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణకొరియా టైటిల్ విజేతగా నిలిచింది. జపాన్తో జరిగిన మ్యాచ్లో కొరియా 4-2 తేడాతో(పెనాల్డీ షూటౌట్) అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 3-3తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.