మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ చెమటోడ్చి నెగ్గగా, యువ షట్లర్ లక్ష్యసేన్కు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 18-21, 27-25, 21-9తో పాయ్ యుపో (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచింది. గంటా 17 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించింది. 18-21తో తొలి గేమ్ను చేజార్చుకున్న సింధు..అద్భుతంగా పుంజుకుంది.
అయితే ప్రత్యర్థి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో ఒకానొక సమయంలో ఓటమిపాలవుతుందా అన్న తరుణం నుంచి బయటపడి రెండో గేమ్ను దక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనీస్ తైపీ షట్లర్కు ఏమాత్రం అవకాశమివ్వని ఈ తెలుగు షట్లర్ మ్యాచ్ను తన వశం చేసుకుంది. మాళవిక బన్సోద్ను తొలి రౌండ్లో చిత్తు చేసిన యె జియా మిన్ (సింగపూర్)తో సింధు ప్రిక్వార్టర్స్లో తలపడనుంది.
మరో పోరులో సైనా నెహ్వాల్ 21-15, 17-21, 21-13తో సిమ్ యుజిన్ (కొరియా)పై నెగ్గి తర్వాతి రౌండ్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ మినహా లక్ష్యసేన్, సాయి ప్రణీత్కు నిరాశ ఎదురైంది. ఏడో సీడ్ శ్రీకాంత్ 22-20, 21-15తో తె యాంగ్ (మలేషియా)పై నెగ్గి ముందంజ వేయగా.. తదుపరి రౌండ్లో వెంగ్హంగ్ యాంగ్ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఐదో సీడ్ లక్ష్య 21-12, 10-21, 19-21తో అన్సీడెడ్ లిషి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు.
56 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో ఓటమిపాలైన లక్ష్య టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోపోరులో సాయి ప్రణీత్ 17-21, 13-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) చేతిలో చిత్తయ్యాడు. మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ అకానె యమగుచి (జపాన్) చేతిలో ఆకర్షి కశ్యప్ ఓటమిపాలవగా.. డబుల్స్లో అశ్వినీ భట్-శిఖా గౌతమ్, సిమ్రాన్ సింఘి-రితిక థాకర్ పరాజయం పొందారు.