న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో గురువారం టోల్ ప్లాజా వద్ద ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పలు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ క్యాటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ అంశంపై ఇవాళ లోక్సభలో అసద్ మాట్లాడారు. తనకు జెడ్ క్యాటగిరీ భద్రత వద్దు అని ఓవైసీ స్పష్టం చేశారు. దేశంలోని పేదలు, అల్పసంఖ్యాకులకు భద్రత కల్పిస్తే చాలన్నారు. టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనను ఆయన గుర్తు చేస్తూ.. ఎటువంటి పుస్తకాలు చదివి వీళ్లంతా తీవ్రవాదులుగా మారుతున్నారో చెప్పాలన్నారు. జెడ్ క్యాటగిరీ భద్రత కాదు.. ఆ ఉన్మాదులపై యూఏపీఏ కేసులు పెట్టాలని అసద్ డిమాండ్ చేశారు. టోల్ వద్ద ఆగిన తన వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఓవైసీ తెలిపారు. రాడికల్స్గా మారిన వారిని శిక్షించకుంటే అతివాద తీవ్రవాదం కూడా పెరుగుతందన్నారు. భారత్ చాలా గొప్ప దేశమని, ఈ దేశ సంపద ప్రేమే అని, ఇక్కడ ప్రజల్లో ప్రేమ ఉంటే చాలన్నారు. తన గొంతును నొక్కేందుకు తూటాలు పేల్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఆరు ఫీట్ల దూరం నుంచి తనపై తూటాలు పేల్చినట్లు ఓవైసీ తెలిపారు. ఇటీవల హరిద్వార్, అలహాబాద్, రాయ్పూర్లో నాపై ఏం మాట్లాడారు ఒకసారి పరిశీలించాలని ఆయన చైర్ను కోరారు. జెడ్ క్యాటగరి నాకొద్దు.. 94 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ప్రాణాలతో ఉండి నా గొంతు వినిపించాలన్నదే ఉద్దేశమని ఓవైసీ అన్నారు. పంజాబ్ టూర్లో ప్రధాని మోదీ సెక్యూర్టీ విషయంలో లోపం జరిగినప్పుడు మొదట తానే ఖండించినట్లు ఓవైసీ గుర్తు చేశారు. బుల్లెట్లు వదలిన వాళ్లకు భయపడడం లేదని, జెడ్ క్యాటగిరీని రిజెక్ట్ చేస్తున్నాని.. వారిపై యూఏపీఏ పెట్టండి.. న్యాయం చేయాలనుకుంటే ఆ పని చేయాలని కోరారు.
ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఓవైసీ దీర్ఘ ఆయువును ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. టోల్ గేటు వద్ద జరిగిన ఘటన పట్ల విచారణ చేపట్టామని, వారిని పట్టుకున్నామని, వాహనాన్ని సీజ్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ఇంకా లోతుగా విచారణ జరుగుతోందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సోమవారం దీని గురించి పూర్తి వివరణ ఇస్తారన్నారు.