వినయ్రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగబాషా, నిహారిక, లెంకల అశోక్రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘శ్రీ రంగనాయక’. గోవిందరాజ్ విష్ణు ఫిలిం పతాకంపై రమావత్ మంగమ్మ నిర్మించారు. నంది వెంకట్రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర పోస్టర్, టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. విష్ణుమూర్తి అవతారాల నేపథ్యంగా భక్తిరస ప్రధానంగా సినిమా సాగుతుందని, తెలుగులో ఎన్నో భక్తిరస చిత్రాలు విజయవంతం కావడం తమకు స్ఫూర్తినిచ్చిందని, మా చిత్రం కూడా ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నామని నటుడు, నిర్మాత వినయ్రాజ్ దుందిగల్ చెప్పారు. ఆధ్యాత్మిక భావన ప్రేక్షకుల్లో కలిగేలా సినిమా రూపొందించామని, త్వరలో విడుదల చేస్తామని అన్నారు దర్శకుడు నంది వెంకట్రెడ్డి. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు సముద్ర తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.