మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్, అదితీరావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హే సినామిక’.ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 3న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్లో మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ..‘బృంద మాస్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. ఆమె దర్శకత్వం చేసినా కొరియోగ్రఫీ మానుకోవద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆమె డ్యాన్సులకు నేను పెద్ద అభిమానిని. మనం సినిమాలో మాకు గుర్తుండిపోయే పాట చేశారు. దుల్కర్ నేను మంచి మిత్రులం. సినిమాల గురించి తక్కువగా మాట్లాడుకుంటాం. ఇద్దరం ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకోలేదు. ఇవాళ ఒకే వేదిక మీద ఉండటం ఆనందంగా ఉంది. ట్రైలర్ బాగుంది. మంచి లవ్ స్టోరి అని తెలుస్తున్నది’ అన్నారు. ‘నా కెరీర్ ఎదుగుదలలో బృంద మాస్టర్ పాత్ర ఎంతో ఉంది. అనేక పాటల్లో రొమాంటిక్గా చూపించారు. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, భావోద్వేగాలకు గురిచేస్తుంది, డ్యాన్సులు చేసేలా సంతోషపెడుతుంది’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక అదితీరావు హైదరి, దర్శకురాలు బృంద మాస్టర్, నిర్మాత సురేష్ బాబు, నటుడు జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు.