హైదరాబాద్ : ప్రతి తల్లి, తండ్రి తమకు ఉత్తమమైన సంతానం కలగాలని, వాళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అయితే.. ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్నారులు పుట్టుకతోనే ఎన్నో సమస్యలతో జన్మిస్తున్నారు. ఇలాంటి విపత్తులు తలెత్తకుండా ఉండాలంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అందరికీ తెలియజెప్పి.. భవిష్యత్ తరాలను తయారు చేసే లక్ష్యంతో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘ఆర్యజనని’ కార్యక్రమం రూపుదిద్దుకున్నది. కార్యక్రమంపై బుధవారం హైదరాబాద్లోని మఠంలో సమావేశం నిర్వహించారు. వీఐఓఎల్ (వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్) డైరెక్టర్ స్వామి శితికంఠానంద.. ‘ఆర్యజనని’ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు.
బిడ్డ గర్భంలో ఉండగా తల్లిదండ్రులు చేసే పనులు, తీసుకునే జాగ్రత్తలు శిశువు పుట్టిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై పాశ్చాత్య సైన్స్ ఈనాడు చెప్తున్న అనేక విషయాలను.. మన పురాణాలు, ఉపనిషత్తులు వేల సంవత్సరాల క్రితమే వెల్లడించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యజనని బృంద సభ్యులు సైతం పాల్గొని పలు అంశాలపై వివరణ ఇచ్చారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆర్యజనని కార్యక్రమాన్ని చేపడుతుండగా.. కలిగే సంతానం ఉత్తమంగా ఉండటానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో తెలిపేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించి.. ‘మేధ’ పేరుతో ఆర్యజనని బృందం వర్క్ షాప్లు నిర్వహిస్తోంది.
ఆర్యజనని టీమ్లో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా ఉన్నారు. వీరంతా విలువైన సూచనలిస్తూ కాబోయే తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ నెల 7న శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వర్క్ షాప్ జరుగనుంది. ఇందులో భాగంగా తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్యజనని బృందం వివరించనుంది. ధ్యానం, భజనలు, యోగాసనాలు తదితర విషయాలు నేర్పడంతోపాటు, బిడ్డ ఎదుగుదలలో వాటి ప్రాధాన్యతను చెప్పనున్నారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను ఉపదేశిస్తారు. కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకోవాలని అనుకున్న వాళ్లు www.aaryajanani.org వెబ్సైట్ను సందర్శించాలని నిర్వాహకులు సూచించారు.