సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని లంగర్ హైజ్లోని బాపుఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీవో వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పర్యాటక, అగ్నిమాపక, సమాచార, ఉద్యనవన తదితర శాఖల అధికారులతో కలిసి బాపుఘాట్లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి సహా ప్రముఖులందరూ హాజరై శ్రద్ధాంజలి ఘటిస్తారని, తదానుగుణంగా విడిపూలతో పాటు చక్కటి పుష్పగుచ్ఛాలు సిద్ధంగా ఉంచాలన్నారు. బాపుఘాట్తో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ తహసిల్దార్ శైలజా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.