న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని సుమీలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు చేరిన వారిలో మూడు వేల మంది భారత పౌరులు ఉన్నట్లు చెప్పారు. వీరిని అక్కడి నుంచి తరలించేందుకు ఎంబసీ ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఉక్రెయిన్లోని 20 వేల మంది భారతీయుల్లో ఇప్పటి వరకు 16 వేలకుపైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.
మరోవైపు ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి కొంత మంది విద్యార్థులు సోమవారం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తిరిగి వచ్చారు. తమ వారిని చూసి కొందరు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉక్రెయిన్లో తాము పడిన కష్టాల గురించి కొంతమంది విద్యార్థులు మీడియా ఎదుట వాపోయారు. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు తాము బంకర్లలో ఉన్నట్లు ప్రియా తెలిపారు. ఖార్కివ్లో చిక్కుకున్న తాము ఆహారం లేక చాలా అవస్థలు పడినట్లు చెప్పారు. చివరకు మార్చి 2న అతికష్టం మీద రైలులో ప్రయాణించి పొరుగు దేశానికి చేరినట్లు చెప్పారు.
కాగా, ఉక్రెయిన్ను వీడే భారతీయులను రైళ్లలో ప్రయాణానికి అనుమతించకపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు ప్రియా తెలిపారు. సుమీలో చిక్కుకున్న వందలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వెంటనే అక్కడి నుంచి తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.