చేర్యాల, డిసెంబర్ 12: ఓ ఆర్మీ జవాన్ కనిపించకుండాపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. విధుల్లో చేరేందుకు ఈ నెల 5న పంజాబ్ బయలుదేరిన అతను ఆర్మీ హెడ్క్వార్టర్స్కు చేరుకోలేదు. ఫోన్లోనూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన బొకూరి విజయ, జైపాల్రెడ్డి దంపతుల రెండో కుమారుడు సాయికిరణ్రెడ్డి పంజాబ్లోని ఫరీద్కోట్ ఆర్మీ హెడ్క్వార్టర్స్లో గన్నర్గా పనిచేస్తున్నారు. 20 రోజుల సెలవుపై ఇటీవల గ్రామానికి వచ్చారు. సెలవులు ముగియడంతో డ్యూటీలో చేరేందుకు ఈ నెల 5న శంషాబాద్లో విమానం ఎక్కిన సాయికిరణ్రెడ్డి పంజాబ్లోని గమ్యస్థానానికి చేరుకోలేదు.
అతని నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడం, ఫోన్చేస్తే స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సాయికిరణ్రెడ్డి డ్యూటీకి రాలేదని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి అతని తండ్రి జైపాల్రెడ్డికి ఆర్మీ అధికారులు ఫోన్చేశారు. తన కుమారుడు ఈనెల 5నే డ్యూటీకి బయలుదేరాడని ఆయన తండ్రి ఆర్మీ అధికారులకు తెలిపారు. కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయికిరణ్రెడ్డి ఢిల్లీలో దిగినట్టు సీసీ టీవీలో రికార్డు అయిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన మొబైల్ ఫోన్ హరియాణ బార్డర్స్లో ఉన్నట్టు లొకేషన్ చూపిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.