సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 7: ఎనిమిదేండ్లుగా ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నా తాను ఎవరికీ తెలియదని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జవాన్ బత్తుల లక్ష్మీదేవి అన్నారు. ‘నమస్తే తెలంగాణ’ జిందగీలో శనివారం ప్రచురితమైన ‘హద్దులు చెరిపి సరిహద్దుల వరకు’ కథనం తన మనస్సుకు హత్తుకున్నదన్నారు. తనను ఎగతాళి చేసిన వారే పత్రికలో వచ్చిన కథనం చూసి అభినందిస్తున్నారని తెలిపారు. ఆదివారం జవాన్ లక్ష్మీదేవిని ఆమె ఇంటి వద్ద జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్ సన్మానించారు.
ఈ సందర్భంగా కథనం ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు లక్ష్మీదేవి కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ భానుమతిగౌడ్ మాట్లాడుతూ.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో మహిళా జవాన్గా విధులు నిర్వహిస్తూ దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న లక్ష్మీదేవిని చూస్తే గర్వంగా ఉన్నదన్నారు. మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జవాన్ లక్ష్మీదేవిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.