బీజింగ్: అమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని చైనా ఫైటర్ జెట్ (Chinese jet) అడ్డుకున్నది. తమ గగనతలంలోకి రావద్దంటూ అమెరికా విమాన పైలట్ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్ర గగనతలంలో ఈ సంఘటన జరిగింది. అమెరికా నేవీకి చెందిన పీ-8 పోసిడాన్ విమానం శుక్రవారం దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవుల సమీపంలో 21,500 అడుగుల ఎత్తులో ఎగిరింది. ఇంతలో క్షిపణులతో కూడిన చైనా జెట్, అమెరికా విమానం వైపు వచ్చింది. కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఆ చైనా జెట్ సుమారు 15 నిమిషాలపాటు యూఎస్ గస్తీ విమానాన్ని అనుసరించి అడ్డుకుంది. ఈ సందర్భంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి అమెరికా ఎయిర్క్రాఫ్ట్ పైలట్కు ఒక సందేశం వచ్చింది. చైనా గగనతలం 12 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. తమ గగనతలంలోకి ప్రవేశిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికా విమానం దారి మళ్లింది. చైనా జెట్ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోయినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
కాగా, దక్షిణ చైనా సముద్రం ప్రాంతమంతా తనదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తున్నది. ప్రతి ఏటా సుమారు 5 ట్రిలియన్ల డాలర్ల వరకు సరుకు రవాణా జరిగే ఈ జలమార్గం, గగనతలంలో ఇతర దేశాల సైనిక కార్యకలాపాలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అలాగే గస్తీ విమానాల ద్వారా తమపై అమెరికా నిఘా పెడుతున్నట్లు చైనా ఆరోపిస్తున్నది.
మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవులతోపాటు సమీప ప్రాంతాలు తమవే అని చైనాతోపాటు ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ వాదిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో చైనా పెత్తనంపై చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ఇది కూడా ఒక కారణమవుతున్నది.