‘ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు విజయాలు వరిస్తాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు మంచి కథల్ని ఎంచుకుంటూ ఉత్తమ నటనను కనబరుస్తున్నాడు. సినిమాల పట్ల అతని తపనే గొప్ప స్థానంలో నిలబెడుతుంది. ఈ చిత్ర నిర్మాతలు నిరంజన్, అన్వేష్లు కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ మంచి సినిమాలు తీస్తున్నారు’ అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. బుధవారం హైదరాబాద్లో జరిగిన ‘అర్జున ఫల్గుణ’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ప్రేక్షకులముందుకురానుంది.
శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘మంచి మనసున్న ఐదుగురు యువకులు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారన్నదే సినిమా కథ. సినీ ఇండస్ట్రీలోకి ఖాళీ చేతులతో వచ్చా. నేను పరిచయం చేసిన దర్శకులందరిని నా ఆస్తిగా భావిస్తా. గోదావరి జిల్లాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. అక్కడి మంచి మనుషులు, సంప్రదాయాలు, అమాయకమైన వ్యక్తిత్వాలు సినిమాలో కనిపిస్తాయి. ఈ సినిమాలో నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా కనిపిస్తా’ అని చెప్పారు. ‘కథ రాస్తున్నప్పుడే శ్రీవిష్ణును హీరో అనుకున్నా. అందమైన భావోద్వేగాలు, ఉత్తేజపూరితమైన యాక్షన్ హంగులతో ఈ సినిమా మెప్పిస్తుంది’ అని దర్శకుడు చెప్పారు. సినిమాలో తాను శ్రావణి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించానని కథానాయిక అమృత అయ్యర్ చెప్పింది.