సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా బహదూర్ పుర పరిధిలో ఆరాంఘర్ నుంచి జూ పార్ వరకు నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. 4.08 కిలోమీటర్ల అతి పెద్ద వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యాని కన్నా ముందుగానే పూర్తి చేయాలని సోమేశ్ కుమార్ అధికారులను ఉద్దేశించి అన్నారు. బహదూర్ పుర జంక్షన్లో చేపట్టిన పలు నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, ఈఎన్సీ జియాఉద్దీన్, ప్రాజెక్టు సీఈ దేవానంద్లతో ఆయన కలిసి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రూ.69 కోట్ల వ్యయంతో చేపట్టిన 690 మీటర్ల పొడవు గల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఈ మార్చి నెల ఆఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదే విధంగా ఓల్డ్ సిటీ వాసులకు, ప్రధానంగా జూ పార్ సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడే అతి పొడవైన ఈ ఫ్లై ఓవర్ పనులను నియమిత లక్ష్యాని కన్నా ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈ నిర్మాణానికి సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తులలో మరికొన్ని ఆస్తులను సేకరించాల్సి ఉన్నందున ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోందని ఇంజనీర్లు వివరించగా, మౌలిక డిజైనింగ్కు అంతరాయం కాకుండా కొన్ని ఆస్తుల సేకరణ చేయకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఆరాంఘర్- జూపార్ ఆరులేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ఏవిధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ, అర్బన్ బయో డైవర్సిటీ, జల మండలి తదితర విభాగాలతో సమన్వయంతో పని చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ పర్యటనలో చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఎస్ఈ దత్తు పంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.