న్యూఢిల్లీ, మార్చి 12: వాహన తుక్కు కేంద్రాల్లో(ఆర్వీఎస్ఎఫ్) పాత వాహనాలను తుక్కుగా మార్చడానికి అనుసరించాల్సిన విధానంపై కేంద్రప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహనాల పత్రాలను ఆన్లైన్లోనే పరిశీలించి సరిచూసుకొన్న తర్వాతే తుక్కుగా మార్చడానికి రిజిస్ట్రేషన్ చేయాలని అందులో పేర్కొన్నది. వాహనాలపై చలాన్లు, కేసులు ఉంటే తుక్కుగా మార్చబోరని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాహనాలను తుక్కు చేయడానికి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపిన తర్వాత తుక్కు కేంద్రాలు వాహన యజమానికి ఓ ధ్రువీకరణ పత్రాన్ని(సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్) ఇస్తాయి. ఇది ఉంటేనే కొత్త వాహనాలు కొనేప్పుడు రాయితీ లభిస్తుంది. కేంద్రప్రభుత్వం గతేడాది ఆగస్టులో వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది.