హైదరాబాద్: పంచాయతీరాజ్, స్థానిక సంస్థలు వివిధ స్థాయిలో కనపర్చిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సూచించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆయా గ్రామీణ స్థానిక సంస్థలు కనపర్చిన ప్రతిభకు అవార్డులను అందిస్తారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తీకరణ్ ఉత్తమ పురస్కారానికి తెలంగాణలోని ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్, ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తారు. ఎంపికైన జిల్లా పరిషత్కు రూ.50లక్షలు, ఎంపికైన ఒక్కొ మండల పరిషత్కు రూ.25లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఇస్తారు.
గ్రామ పంచాయతీలకు తొమ్మిది అంశాలను ప్రాతిపదికన తీసుకొని ఎంపిక చేస్తారు. నానాజీ దేశముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం అవార్డును అభివృద్ధిలో గ్రామ సభను సమర్ధవంతంగా వినియోగించిన గ్రామ పంచాయతీలకు ఇస్తారు. తెలంగాణలోని ఒక గ్రామ పంచాయతీని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. పురస్కారంతో పాటుగా రూ.10లక్షల నగదును అందజేస్తారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) అవార్డులో భాగంగా రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీకి అవార్డు ఇస్తారు. రూ.5లక్షల నగదు అందిస్తారు. పిల్లల స్నేహపూర్వక గ్రామ పంచాయతీ అవార్డు కు గ్రామ పంచాయతీలు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించే తీరు ఆధారంగా అవార్డును ఇస్తారు. పురస్కారంతో పాటుగా రూ.5 లక్షల నగదును ఇస్తారు. ఈ అవార్డులకు అర్హత ఉన్న గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు డిసెంబర్ 15లోగా వివరాలను ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆప్లోడ్ చేసిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయి కమిటీలు ధృవీకరణ చేసి డిసెంబర్ 25లోగా రాష్ట్ర స్థాయి కమిటీకి ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఈ అవార్డులను జాతీయ పంచాయతీ దినోత్సవం ఏప్రిల్ 24న అందజేస్తారు.